
15 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్/చిలమత్తూరు: తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం జిల్లాలోని 15 మండలాల పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా లేపాక్షి మండలంలో 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక అగళి 6.4 మి.మీ, గోరంట్ల 6.2, గుడిబండ 6, పరిగి 4.2, హిందూపరం 3.4, సీకేపల్లి 2.8, మడకశిర 2.6, రొళ్ల 2.4, అమడగూరు 2.4, బుక్కపట్నం 1.8, తనకల్లు 1.8, ముదిగుబ్బ 1.4, సోమందేపల్లి 1.4, రొద్దం మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఖరీఫ్కు సిద్ధమవుతున్నారు.
జిల్లాకు వర్షసూచన..
రాగల ఐదు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షసూచన ఉందని వెల్లడించారు. గంటకు 16 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీచే అవకాశం ఉందన్నారు.
వ్యవసాయ సలహాలు..
ఈనెల 26న నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గాలులు వీచే అవకాశం ఉన్నందున అరటి, బొప్పాయి లాంటి వాటికి ఊతకర్రలు పెట్టుకోవాలని, రాలిన మామిడి కాయలు వెంటనే సేకరించి విక్రయించుకోవాలన్నారు. జీలుగ, జనుము, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుని భూసారం పెంచుకోవాలన్నారు. జీవాల్లో ఈటీ, షీప్ పాక్స్ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున టీకాలు వేయించుకోవాలన్నారు. పిడుగులు పడే పరిస్థితి ఉన్నందున రైతులు, కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.