
బాబు స్వార్థం.. సీమకు అన్యాయం
ఆత్మకూరు: జిల్లాలో రైతు మనుగడను కూటమి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తోంది. కుప్పం ప్రాంతానికి హంద్రీ–నీవా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్లాలనే సీఎం చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాప్తాడు నియోజకవర్గ రైతులు ఉద్యమ కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఈ నెల 29 నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రకటించారు.
టీడీపీ నేతల్లోనూ వ్యతిరేకత
కరువు పీడిత రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రీ–నీవా ప్రాజెక్ట్ చేపట్టి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశారు. కాలువలో నీరు ప్రవహించే సమయంలో ఎంతో కొంత నీరు భూమిలోకి ఇంకడం ద్వారా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో జిల్లాలో ఉద్యాన పంటలు గణనీయంగా విస్తరించాయి. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 83 టీఎంసీలకు పెంచుతూ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి రాకపోవడంతో ఈ పనులు ముందుకు సాగలేదు. అనంతరం ఈ పనులను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తన సొంత నియోజకవర్గం కుప్పం ప్రాంతానికి కృష్ణా జలాలను తీసుకెళ్లేందుకు కాలువకు లైనింగ్ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు తగ్గిపోయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయి. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లైనింగ్ పనులను అడ్డుకున్నారు.
వట్టిపోనున్న చెరువులు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ హంద్రీ–నీవా ద్వారా కొత్త ప్రాజెక్టులకు కూడా నీరు అందించేలా చర్యలు తీసుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు (కర్నూలు తాగునీటి పథకం)కు 3 టీఎంసీలు, డోన్లో లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 63 చెరువులకు నీరు ఇచ్చేందుకు 2 టీఎంసీలు, జిల్లాలోని శింగనమల చెరువుకు 1 టీఎంసీ, శింగనమల పాత తాలూకాలోని చెరువులకు 1.3 టీఎంసీలు, జీడిపల్లి, భైరవానితిప్ప, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు 3.7 టీఎంసీలు, అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు, సోమరాండ్లపల్లి రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు 4.5 టీఎంసీలు, శ్రీసత్యసాయి జిల్లాలోని 193 చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 3 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 23 టీఎంసీలు కేటాయించడంతో పాటు 40 టీఎంసీల నీటిని రాయలసీమలోని 6 లక్షల ఎకరాలకు అందించేలా బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. కాలువకు లైనింగ్ పనులు చేయడం ద్వారా భవిష్యత్తులో నీరంతా దిగువకు వెళ్లిపోయి చెరువులన్నీ పూర్తిగా వట్టిపోయే ప్రమాదం నెలకొంది.
హంద్రీ–నీవా లైనింగ్ పనులతో బీళ్లుగా మారనున్న రాయలసీమలోని 6 లక్షల ఎకరాలు
కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు
అన్యాయాన్ని ప్రతిఘటించకపోతే రైతు మనుగడకే ముప్పు
ప్రభుత్వంపై పోరుకు సిద్ధమంటున్న ‘రాప్తాడు’ రైతులు
పంటల సాగు కష్టం
రాప్తాడు నియోజకవర్గంలో చాలా పొలాలు హంద్రీ–నీవా కాలువ పక్కనే ఉన్నాయి. హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం వల్ల భూగర్భ జలాలు పెరిగి మా వ్యవసాయ బోరు బావుల్లో నీటి లభ్యత పెరిగింది. దీంతో నాకున్న 4 ఎకరాల్లో చీనీ పంట సాగు చేశా. ఇప్పుడేమో కాలువకు లైనింగ్ పనులు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే భూగర్భ జలాలు అడుగంటి బోరు బావుల్లో నీటి లభ్యత లేక పంటలు సాగు చేయడం కష్టమవుతుంది. రైతు కష్టాన్ని ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. లైనింగ్ పనులు ఆపి 83 టీఎంసీల నీటి ప్రవాహం ఉండేలా కాలువను వెడల్పు చేయాలి.
– సుబ్బర రామాంజినేయులు, సిద్ధరాంపురం, ఆత్మకూరు మండలం
రైతుల పొట్ట కొట్టొద్దు
హంద్రీ–నీవాలో నీటి ప్రవాహం వల్ల చాలా మంది బోరు బావుల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కాలువ పక్కన పొలాల్లో చీనీ, అరటి, టమాట, వరి, అంజూర, ద్రాక్ష, దానిమ్మ వంటి ఉద్యాన పంటల సాగు పెరిగింది. హంద్రీ–నీవా కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తయితే బోర్లు ఎండి పోయే ప్రమాదముంది. రైతులు నష్టపోతారు. కాంక్రీట్ లైనింగ్ పనులతో రైతుల పొట్ట కొట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
– వెంకటేష్, సింగంపల్లి, ఆత్మకూరు మండలం

బాబు స్వార్థం.. సీమకు అన్యాయం

బాబు స్వార్థం.. సీమకు అన్యాయం