చౌకధరల దుకాణాల వద్దే రేషన్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

చౌకధరల దుకాణాల వద్దే రేషన్‌ పంపిణీ

May 28 2025 5:51 PM | Updated on May 28 2025 5:51 PM

చౌకధరల దుకాణాల వద్దే రేషన్‌ పంపిణీ

చౌకధరల దుకాణాల వద్దే రేషన్‌ పంపిణీ

జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రశాంతి నిలయం: జూన్‌ నెలకు సంబంధించన రేషన్‌ సరుకులను చౌకధరల దుకాణాల వద్దే పంపిణీ చేయనున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డుదారులు ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల వద్ద రేషన్‌ సరుకులు పొందవచ్చన్నారు. డీలర్లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నిత్యావసర సరుకుల అందించాలన్నారు. ధరల్లో, తూకాల్లో తేడాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ సరుకులు అందించాలన్నారు. రేషన్‌ సరుకులు పంణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా ఆయా మండలాల తహసీల్దార్లు, సీఎస్‌డీటీలు పర్యవేక్షించాలని ఆదేశించారు.

రేపటి నుంచి

రైతుల వద్దకే శాస్త్రవేత్తలు

బుక్కరాయసముద్రం: ‘వికసిత్‌ కృషి సంకల్ప అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రయోగశాల నుంచి భూమికి అనే నినాదంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 నుంచి జూన్‌12వ తేదీ వరకు రైతుల వద్దకే శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లేశ్వరి తెలిపారు. రోజూ 3 గ్రామాలు చొప్పున 32 మండలాల్లోని గ్రామాలను శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సందర్శించి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో అనువైన పంటలు, అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, ఎరువుల యాజమాన్య పద్దతలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణ, భూసార పరీక్షలు, డ్రోన్‌ వినియోగం, తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు.

బాలిక బలవన్మరణం

తాడిపత్రి టౌన్‌: స్థానిక సీపీఐ కాలనీకి చెందిన రజని (16) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కాలనీకి చెందిన చాకలి పుల్లయ్య, రాజేశ్వరి దంపతుల కుమార్తె రజని ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 500 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఫలితాలు అందిన రోజున తల్లిదండ్రులు విజయవాడలోని కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివిస్తామని చెప్పడంతో సంతోష పడింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మూడు రోజుల క్రితం తాడిపత్రిలోనే చదువుకోవాలని తల్లిదండ్రులు సూచించారు. దీంతో క్షణికావేశానికి లోనైన బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సాయిప్రసాద్‌ తెలిపారు.

బలవంతపు పెళ్లిపై ఫిర్యాదు

గుమ్మఘట్ట: తనకు ఇష్టం లేకపోయినా కుటుంబసభ్యులు బలవంతంగా పెళ్లి చేశారంటూ పోలీసులకు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. వివరాలు.. రాయదుర్గం పట్టణానికి చెందిన వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్దమ్మాయిని గుమ్మఘట్ట మండలం పూలకుంట గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ క్రమంలోనే మైనారిటీ తీరని రెండో అమ్మాయిని కూడా నెల రోజుల క్రితం పూలకుంట గ్రామానికి చెందిన మరో వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే అప్పటికే అతనికి వివాహమై ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. ఈ పెళ్లి ఇష్టం లేని బాలిక స్థానికుల సహకారంతో తప్పించుకుని నేరుగా ఎస్పీని ఆశ్రయించింది. తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేశారని వాపోయింది. దీనిపై ఎస్పీ ఆదేశాల మేరకు గుమ్మఘట్ట పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ప్రమాదంలో యువకుడి మృతి

బెళుగుప్ప: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం అంకంపల్లికి చెందిన ఆవుల హనుమంతరాయుడు (34)కు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. మంగళవారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రహదారి పక్కనే ఉన్న గోడను ఢీకొని సమీపంలోని గుంతలోకి దూసుకెళ్లాడు. ఘటనలో తలకు, చాతీకి బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్న హనుమంతరాయుడిని స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శివ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement