
పీఆర్లో సజావుగా బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: పంచాయతీరాజ్ (పీఆర్) శాఖకు సంబంధించి అనంతపురంలోని పీఆర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జోనల్ స్థాయి (రాయలసీమ జిల్లాలు) బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, బాలాజీ (తిరుపతి), చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాలకు చెందిన డీఈఈలు, ఏఈఈలు, జేఈఈలు, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగింది. ఆ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) బాలూనాయక్, ఎస్ఈ జహీర్ అస్లాం, శ్రీసత్యసాయి జిల్లా ఎస్ఈ మురళి, ఇతర జిల్లాల ఎస్ఈలతో పాటు పీఆర్ఐ ఈఈ ప్రభాకరరెడ్డి, అనంతపురం సబ్ డివిజన్–1, 2 డీఈఈలు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి, సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్లు ఖాజా మొహిద్దీన్ తదితరులు పర్యవేక్షించారు. ఒకే చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారితో పాటు రిక్వెస్ట్ బదిలీలనూ ఆమోదించారు.