
ప్రియుడి వ్యసనాలు నచ్చక యువతి ఆత్మహత్య
అగళి: చెడు వ్యసనాలు మానాలని చెప్పినా ప్రియుడు వినకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... రొళ్ల మండలం ఎం.రాయపురం గ్రామానికి చెందిన రాజన్న కుమారుడు పునీత్, అగళికి చెందిన దళిత సన్న భూతన్న, కారియమ్మ దంపతుల మూడో కుమార్తె రక్షిత (22) ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. ఆగస్టులో ఇద్దరికీ పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిశ్చయించారు. ఈ క్రమంలో పునీత్ రోజూ రక్షితకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. మాటల్లో పునీత్ వ్యసన పరుడని రక్షిత గుర్తించింది. ఆయనకు తాగుడు అలవాటుతో పాటు ఇతర దురలవాట్లూ ఉన్నాయని తెలుసుకున్న ఆమె వాటిని మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా పునీత్లో మార్పు రాలేదు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పకోలేక తనలో తాను కుమిలిపోతూ వచ్చింది. రేపు పెళ్లి తర్వాత ఇంటి అల్లుడు వ్యసనపరుడని తెలిస్తే పుట్టింటి వారి గౌరవానికి భంగం కలుగుతుందని భావించిన ఆమె సోమవారం రాత్రి ఇంట్లోనే పైకప్పునకు ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను కాపాడి స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కర్ణాటకలోని శిరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనకు సంబంధించి సన్న భూతన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అగళి పీఎస్ ఎస్ఐ వీరేష్ తెలిపారు.