
బలవంతపు భూ సేకరణపై ఆగ్రహం
● వ్యవసాయం వీడితే వలసలే గతి
● తమ భూములను వదిలేయాలని రైతుల వేడుకోలు
లేపాక్షి/ హిందూపురం: పరిశ్రమల స్థాపన కోసం వ్యవసాయ భూములను లాగేసుకోవడం తగదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూసేకరణ చేయడాన్ని నిరసిస్తూ కొండూరు, తిమ్మగానిపల్లి, వడ్డిపల్లి గ్రామాల రైతులు వ్యవసాయ కార్మిక, రైతు సంఘం నాయకులతో కలిసి సోమవారం లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు భూములు లాగేసుకుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నామని తెలిపారు. భూములు కోల్పోతే జీవనం కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందన్నారు. తమ భూములను తమకు వదిలేయాలని అధికారులను వేడుకున్నారు. అలాగే హిందూపురం మండలం చలివెందుల, రాచపల్లి మలుగూరు, మీనకుంటపల్లిలో బలవంతపు భూసేకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఓపీడీఆర్ నాయకులు, రైతులు ర్యాలీగా వెళ్లి హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఏడాదికి మూడు పంటలు పండే 2,191 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని రైతులు మండిపడ్డారు. తమ ప్రమేయం లేకుండానే భూములు సర్వే చేయడం ఏమిటని నిలదీశారు. నాయకులు మాట్లాడుతూ బడా బాబులకు, అదాని, అంబానీ కంపెనీలకు ధారాదత్తం చేయడం కోసమే భూములను సేకరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పారిశ్రామిక వాడ కోసం భూములు సేకరించారని, అందులో ఎన్ని పరిశ్రమలు స్థాపించారంటూ ప్రశ్నించారు. హిందూపురం తహసీల్దార్ వెంకటేశులు స్పందిస్తూ రైతుల అనుమతి లేకుండా భూములను తీసుకోబోమని స్పష్టం చేశారు. రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా
పని చేయాలి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేసి చక్కటి ఫలితాలు సాధించాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ 224 అర్జీలు స్వీకరించారు. పింఛన్లు, ఇళ్లు, స్థలాలు, భూ సమస్యలు తదితర వాటిపై ఎక్కువగా అర్జీలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డీఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అర్జీల పరిష్కారంలో ఫలితాలు సాధించాలన్నారు.
యోగాంధ్రను విజయవంతం చేయాలి
యోగాంధ్ర కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి కృషితో విజయవంతం చేయాలని కలెక్టర్ చేతన్ కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యోగాంధ్ర షెడ్యూల్స్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 28న పుట్టపర్తి, జూన్ 4న కదిరి, జూన్ 6న ధర్మవరం, జూన్ 15న పెనుకొండ, జూన్ 13న హిందూపురంలో టీచర్స్–స్టూడెంట్స్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించాలన్నారు. జూన్ 21న లేపాక్షిలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, డీఆర్డీఎ పీడీ నరసయ్య, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, పట్టు పరిశ్రమల శాఖ జేడీ పద్మావతి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సీపీఓ విజయ్కుమార్, ఎల్డీఎం రమణకుమార్, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, మత్స్య శాఖ అధికారి చంద్రశేఖర్రెడ్డి, డీసీహెచ్ఎస్ తిప్పేంద్ర నాయక్, డీఎంహెచ్ఓ ఫెరోజాబేగం, సాంఘిక సంక్షేమ శాఖ ప్రతినిధి శివరంగ ప్రసాద్, డీపీఓ సమత, ఆరోగ్య శ్రీ కోఆర్డినేటర్ శ్రీదేవి, డీఎఫ్ఓ చక్రపాణి, సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్రెడ్డి, క్రీడల శాఖ అధికారి ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.

బలవంతపు భూ సేకరణపై ఆగ్రహం