
ఇదెక్కడి న్యాయం..?
కదిరి: కష్టపడి పాఠాలు చెప్పి బడిలో విద్యార్థుల సంఖ్య పెంచిన వారి కన్నా.. విధులకు డుమ్మా కొడుతూ ఆ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గి పోవడానికి కారణమైన ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఈ బదిలీల్లో 7 అదనపు పాయింట్లు కేటాయిస్తోంది. మరోవైపు బాగా పాఠాలు చెప్పి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్న ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేస్తోంది. దీన్ని మెజార్టీ ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. పిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణమైన ఉపాధ్యాయులకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఇలా అదనపు పాయింట్లు కేటాయించడమేంటని వారు మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు మూడు వేల మంది దాకా ఉన్నారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.
ఆన్లైన్ ద్వారానే బదిలీ ఉత్తర్వులు
బదిలీలకు దరఖాస్తు చేసుకున్న టీచర్లకు ఆన్లైన్ ద్వారానే ఉత్తర్వులు అందనున్నాయి. హెచ్ఎంలకు ఈ నెల 30న, స్కూల్ అసిస్టెంట్లకు జూన్ 4న, ఎస్జీ టీచర్లకు జూన్ 11న బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి. ఎస్జీటీల దరఖాస్తు ప్రక్రియ గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ నెల 31న ఎస్జీటీల ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా విడుదల కానుంది. ఈ జాబితాపై అభ్యంతరాలను ఎస్జీటీలు ఈ నెల 28 నుంచి జూన్ 1లోగా తెలియజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. బదిలీలకు సంబంధించి పాఠశాల ఎంపికకు హెచ్ఎంలు ఈ నెల 28లోగా, స్కూల్ అసిస్టెంట్లు జూన్ 1, 2వ తేదీల్లో, ఎస్జీటీలు జూన్ 7 నుంచి 10వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్–2025 ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతం ఈ బదిలీలు చేపడుతోంది. ఎస్జీ టీచర్లకు ఆఫ్లైన్ ద్వారానే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుగా పేర్కొన్నప్పటికీ.. దీనిపై ఇప్పటి దాకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
విద్యార్థుల సంఖ్య తగ్గించిన
వారికి 7 అదనపు పాయింట్లు
గందరగోళంగా మారిన ఉపాధ్యాయుల బదిలీలు
నేటితో ముగియనున్న ఎస్జీటీల దరఖాస్తుల గడువు
సాంకేతిక చిక్కులు
బదిలీల ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ఉపాధ్యాయులను ఆందోళనకు, గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీనిపై తమకు జరిగిన అన్యాయాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదిస్తే తమ పరిధిలో ఏమీ లేదని, రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని పలువురు టీచర్లు వాపోతున్నారు. దరఖాస్తు చేసే సమయంలో తమకు స్టేషన్ పాయింట్లు రావడం లేదని కొందరు, స్పౌజ్ పాయింట్ల విషయంలోనూ సమస్యలున్నాయని ఇంకొందరు అంటున్నారు. బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.