
సౌదీలో ధర్మవరం వాసి అవస్థలు
ధర్మవరం అర్బన్: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి ఏజెంట్ చేసిన మోసం వల్ల ఇబ్బందుల్లో పడ్డాడు. డ్రైవింగ్ కోసమని వెళ్తే ఇంటి పనుల్లో కుదిర్చారు. ఇంటి పనులు సరిగా చేయడం లేదని యజమానులు వీసా లాగేసుకుని.. చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తన భర్తను రక్షించాలని భార్య ధర్మవరం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు... బోయవీధికి చెందిన సయ్యద్ ఫరూఖ్, హర్షియా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఉపాధి కోసం సౌదీకి వెళ్లేందుకు పుట్టపర్తికి చెందిన ఏజెంట్ ఖలీల్ను సంప్రదించాడు. డ్రైవింగ్ పని ఇప్పిస్తానని చెప్పి అతని నుంచి ఏజెంట్ రూ.1.40 లక్షలు తీసుకున్నాడు.
వీసాలో మోసం..
డ్రైవింగ్ వీసా స్థానంలో ఏజెంట్ ‘ఫ్రీ వీసా’ ఇచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 23న ఫరూఖ్ను విమానంలో సౌదీకి పంపించాడు. అక్కడి ఎయిర్పోర్టులో దిగిన ఫరూఖ్ను తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో ఏజెంట్ను ఫోన్లో సంప్రదించాడు. ఏజెంట్ మరో వ్యక్తిని ఫరూఖ్ దగ్గరకు పంపించాడు. అతను ఫరూఖ్ను తీసుకెళ్లి వాళ్లకు సంబంధించిన పెద్ద భవనాల్లో శుభ్రం చేసేందుకు, ఇంటి పనులు చేసేందుకు నియమించాడు. తాను డ్రైవింగ్ పని కోసం వచ్చానని, ఇంటి పనులు చేయనని మొండికేయడంతో ఆగ్రహించిన యజమానులు అతని వద్దనున్న ఫ్రీవీసా లాక్కున్నారు. బెల్టు, స్టీల్ పైపులతో చితకబాదేవారు. రోజూ మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను శుభ్రం చేసినా.. చిన్నపాటి దుమ్ము, ధూళి కనిపిస్తే యజమానులు మరోసారి శుభ్రం చేయించేవారు.
జరిమానా విధించిన సౌదీ ప్రభుత్వం
ఓ రోజు ఇంటి పనులు ముగించుకుని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గదికి నడుచుకుంటూ వెళ్తున్న ఫరూఖ్ను సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకుని, వీసా లేదని కేసు నమోదు చేశారు. 20 వేల దినార్లు (రూ.4.50 లక్షలు) జరిమానా విధించారు. ఆ డబ్బు చెల్లించాలని పోలీసులు ఒత్తిడి చేయడంతో ఫరూఖ్ తన భార్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ప్రస్తుతం సౌదీలోని మదరసాలో ఉంటున్నానని తెలిపాడు.
భర్తను విడిపించాలని వేడుకోలు
సౌదీలో బందీ అయిన తన భర్తను విడిపించడంతో పాటు వీసా పేరిట మోసం చేసిన ఏజెంట్ ఖలీల్పై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్ భార్య హర్షియా సోమవారం ధర్మవరం వన్టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్కు ఫిర్యాదు చేసింది. ఏజెంట్ ద్వారా ఫరూఖ్ను ఇండియాకి రప్పిస్తామని సీఐ హామీ ఇచ్చారు. అనంతరం ఫరూఖ్ కుటుంబ సభ్యులు మంత్రి సత్యకుమార్యాదవ్ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన మంత్రి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్కు లేఖ రాసి.. ఫరూఖ్ను కాపాడాలని, అతని పాస్పోర్టును తిరిగి అందించాలని, భారత దౌత్య కార్యాలయం ద్వారా నిరంతర కమ్యూనికేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఉద్యోగం పేరిట ఏజెంట్ మోసం
డ్రైవర్ జాబ్ అని..
ఇంటి పనికి కుదిర్చిన వైనం
పని చేయలేక యజమానుల చేతిలో చిత్రహింసలు