జగన్‌ ఫొటో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ ఫొటో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం

May 26 2025 1:40 AM | Updated on May 26 2025 1:40 AM

జగన్‌ ఫొటో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం

జగన్‌ ఫొటో చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం

మడకశిర: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఫొటోను చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంటోందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప విమర్శించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్‌, మడకశిర ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌, ఎంఎస్‌ రాజు.. జెడ్పీ చైర్మన్‌ బోయ గిరిజమ్మ చాంబర్‌లోకి దౌర్జన్యంగా వెళ్లి వైఎస్‌ జగన్‌ ఫొటోను తొలగించి.. చెత్త రాజకీయాలకు తెర లేపారని ధ్వజమెత్తారు. మహిళా అనే గౌరవం లేకుండా చాంబర్‌లోకి అక్రమంగా చొరబడడం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేయడమేనని మండిపడ్డారు. వెంటనే పోలీసులు సదరు ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికే డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారన్నారు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు ఒక అడుగు ముందుకేసి దుర్యోధనుడి పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు. మడకశిర నియోజకవర్గంలోని ప్రజలు ఎమ్మెల్యే వ్యవహార శైలిని గమనిస్తున్నారని తెలిపారు. జెడ్పీ నుంచి నియోజకవర్గానికి అవసరమైన నిధులు తీసుకురావడానికి ఎమ్మెల్యే కృషి చేయకుండా చైర్‌పర్సన్‌ చాంబర్‌లోకి దౌర్జన్యంగా వెళ్లి రభస సృష్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎమ్మెల్యే తన వ్యవహార శైలి మార్చుకోకపోతే రాజకీయాల్లో కనుమరుగు కావడం ఖాయమని పేర్కొన్నారు. సంక్షేమ పాలనతో వైఎస్‌ జగన్‌ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని గుర్తు చేస్తూ.. ఫొటో తీసేసినంత మాత్రాన ఏమీ కాదని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడం మాని నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించాలని ఎంఎస్‌ రాజుకు ఈరలక్కప్ప సూచించారు.

అభివృద్ధి పనులు చేయకుండా చెత్త రాజకీయాలు చేస్తున్నారు

వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement