
చిరుత సంచారంతో కలవరం
అగళి: హెచ్డీ హళ్ళి పంచాయతీ గాయత్రి కాలనీ గ్రామ సమీపాన ఫారెస్ట్లో తరచూ చిరుత సంచరిస్తోంది. ఆదివారం రాత్రి కాలనీకి వెళ్లే రోడ్డు పక్కన చిరుతను గమనించి కొందరు వీడియో తీశారు. గొర్రెల మందలపై దాడి చేసి గొర్రెను లాక్కువెళుతుండాగా ప్రజలు కేకలు వేయండంతో వదలి వెళ్లిపోయింది. అయితే రెండు చిరుత పిల్లలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తల్లి చిరుత గ్రామంలోకి ఎప్పుడు వస్తుందోనన్న కలవరం వారిలో మొదలైంది. వ్యవసాయ పనులు, పశువుల, గొర్రెలను మేపడానికి వెళ్లేవారు భయాందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని కరిదాసనపల్లి సమీపంలో పెద్దబండలో కూడా ఇదే మాదిరిగా చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ అధికారులు స్పందించి గ్రామాల్లోకి చొరబడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉదుగూరులోనూ చిరుత అలజడి
అమరాపురం: ఉదుగూరులో చిరుత అలజడి రేపుతోంది. ఆదివారం తెల్లవారుజామున గ్రామ పొలి మేరలోకి చిరుత వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్కను చంపినట్లు, చిరుత కాలినడకన వెళ్లినట్లు ఆనవాళ్లను గుర్తించారు. రాత్రిపూట పొలాలు, బయటకు రావాలంటే భయాందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకుని అడవుల్లో వదిలేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

చిరుత సంచారంతో కలవరం