చెరువు మట్టినీ మింగేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

చెరువు మట్టినీ మింగేస్తున్నారు!

May 26 2025 1:39 AM | Updated on May 26 2025 1:39 AM

చెరువు మట్టినీ మింగేస్తున్నారు!

చెరువు మట్టినీ మింగేస్తున్నారు!

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, కాలువ గట్లతో పాటు రాయలచెరువు గ్రామ సమీపంలోని చెరువులో మట్టినీ మింగేస్తున్నారు. పచ్చని ప్రకృతిపై పంజా విసిరి, సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులో రోజూ 500 టిప్పర్ల మట్టిని తోలుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి, రెండు రోజులు ఇరిగేషన్‌ అధికారులు హడావుడి చేసి.. మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మాట నిలబెట్టుకున్న పెద్దారెడ్డి

శ్రీకృష్ణదేవరాయలు కాలంలో రాయలచెరువు గ్రామ సమీపంలో రిజర్వు కొండ, ఊరుగట్ట, పిచ్చల కొండల మధ్య సర్వే నంబర్‌ 705లో 525 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చెరువు నిర్మించారు. ఈ మూడు కొండల్లో ఖనిజ నిక్షేపాలను తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. తవ్వకాలు చేపట్టిన తర్వాత నుంచి క్రమేణా కొండల ఆనవాళ్లే లేకుండా పోతున్నాయి. 2017లో తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి యాడికి మండలం బోగాలకట్ట నుంచి రాయలచెరువు గ్రామం వరకు పాదయాత్ర చేపట్టిన సమయంలో తాను ఎమ్మెల్యేగా గెలుపొందితే చెరువును నింపి.. సమీపంలోని కాలువలకు నీటిని విడుదల చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఎమ్మెల్యే అయ్యాక నాలుగు సార్లు రాయలచెరువు చెరువును నింపి.. కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు.

చెరువును విస్మరించిన జేసీ కుటుంబం

తాడిపత్రి నియోజకవర్గం నుంచి గెలిచిన జేసీ సోదరులు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో రాయలచెరువును పూర్తిగా విస్మరించారు. తమ స్వలాభం కోసం చెరువును నీటితో నింపకుండా వదిలేశారు. ఇక్కడ రైతులు, కూలీలు ఎప్పుడూ దయనీయ స్థితిలో ఉండటమే వారు కోరుకున్నారని కేతిరెడ్డి పెద్దారెడ్డి పలు సందర్భాల్లో జేసీ సోదరులను విమర్శించారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ ప్రజల వద్దకు వెళ్లరని, వారికి ఏదైనా సమస్యను చెప్పాలన్నా ప్రజలు భయపడిపోయేవారని అన్నారు.

చెరువు మట్టిని దోచేస్తున్నారిలా..

అధికార పార్టీకి చెందిన యాడికి మాజీ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో గత ఏడాది అక్టోబర్‌ నుంచి మట్టి దోపిడీ కొనసాగుతోంది. మూడు హిటాచీలతో రోజుకు 500 టిప్పర్ల మేర రాయలచెరువు నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. ఇప్పటి వరకు వంద ఎకరాల విస్తీర్ణంలో మట్టిని తవ్వేసినట్లు తెలుస్తోంది. రాయలచెరువు పరిసర ప్రాంతాల్లోని పొలాలైతే టిప్పర్‌కు రూ.3 వేల ప్రకారం, వేరే మండలాలకు దూరాన్ని బట్టి రూ.10వేల వరకు వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. చెరువు మట్టిని అధికారుల అనుమతితో రైతులు ఉచితంగా పొలాలకు తరలించుకునే వెసులుబాటు ఉంది. అయితే టీడీపీ నాయకులు మాత్రం రైతులను చెరువు దరిదాపులకు రానివ్వకుండా తాము నిర్ణయించిన ధరతోనే తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు.

మట్టి తవ్వకాలకు అనుమతుల్లేవు

రాయలచెరువు 525 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ అనుమతులు లేవు. అయితే కొంతమంది రైతులు తమ పొలాలకు మట్టి కావాలని కోరితే ఇరిగేషన్‌ శాఖ అధికారులకు నివేదిక పంపించాం.

– ప్రతాప్‌రెడ్డి, తహసీల్దార్‌, యాడికి

రాయలచెరువు గ్రామ సరిహద్దులో ఆగని మట్టి దోపిడీ

24 గంటలూ హిటాచీ, జేసీబీలతో తవ్వకాలు

రోజూ రూ.లక్షలు చేతులు మారుతున్న వైనం

చేష్టలుడిగి చూస్తున్న అధికార యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement