రాప్తాడులో రౌడీ రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రాప్తాడులో రౌడీ రాజ్యం

May 26 2025 1:39 AM | Updated on May 26 2025 1:39 AM

రాప్తాడులో రౌడీ రాజ్యం

రాప్తాడులో రౌడీ రాజ్యం

ఆత్మకూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ టీడీపీ నాయకులు భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్‌ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు చేపట్టి కృష్ణా జలాలను జిల్లాకు అందించారని గుర్తు చేశారు. ఈ కాలువను 83 టీఎంసీల నీటి ప్రవాహ సామర్థ్యానికి పెంచేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనులు ప్రారంభించారని, అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 టీఎంసీలకే పరిమితం చేస్తూ కాలువకు లైనింగ్‌ పనులను సీఎం చంద్రబాబు చేపట్టారని తెలిపారు. కాలువకు లైనింగ్‌ పనులు పూర్తయితే రాప్తాడు నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలు, హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో దాదాపు 5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారుతాయన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 29వ తేదీ నుంచి రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని రైతులతో కలసి ఆయా మండలంలోనే రిలే నిరాహార దీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

అంతా అక్రమ ఆదాయమే..

రాప్తాడు నియోజకవర్గంలో ఇప్పటికే ముగ్గురిని అతి కిరాతకంగా టీడీపీ నాయకులు హతమార్చారన్నారు. 300కు పైగా అక్రమ కేసులతో దౌర్జన్యాలకు దిగారన్నారు. ఇక దాడుల్లో గాయపడిన వారి సంఖ్య కూడా భారీగా ఉందన్నారు. లేని భూ సమస్యలను సృష్టించి సెటిల్‌మెంట్‌లకు రాకపోతే హత్యలు చేయిస్తున్నారన్నారు. రూ.లక్షల్లోనే మట్టి దోపిడీలు సాగిస్తున్నారన్నారు. కక్కలపల్లి టమాట మండిలో శ్రీరామ్‌ ట్యాక్స్‌ నడుస్తోందన్నారు. ఏడాదికి రూ.5 కోట్లకు పైగా అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. మద్యం దుకాణాల్లో బాటిల్‌పై రూ.10 శ్రీరామ్‌ ట్యాక్స్‌ అంటూ వసూలు చేస్తున్నారన్నారు. కంకర మిషన్‌ నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారన్నారు. ఇసుక అమ్ముకునేందుకు వీలుగా పేరూరు డ్యాంకు నీరు రాకుండా చేస్తున్నారన్నారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి

వైఎస్సార్‌సీపీ హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయి తప్ప కూటమి ప్రభుత్వంలో కాదన్నారు. జీడిపల్లి నుంచి ఆత్మకూరుకు నీటిని అందించేందుకు రూ.170 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి ఐదు సబ్‌ స్టేషన్లు తీసుకురాగా, వీటిలో తోపుదుర్తి, గొరిదిండ్ల సబ్‌స్టేషన్‌ల పనులను ఈ ప్రభుత్వం మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తోందన్నారు. అనంతపురం – తగరకుంట మార్గంలో సగం రోడ్డు పూర్తి చేస్తే ఆ తర్వాత సగం రోడ్డు పనులకు కనీసం కంకర కూడా వేయలేదన్నారు. పీఏబీఆర్‌ నుంచి రూ.67 కోట్లతో తాగునీటి పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా... నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, కేవలం ప్రకాష్‌రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పరిటాల సునీత నేతృత్వంలోనే అనంతపురం రూరల్‌ పరిధిలో ఇళ్లు కూల్చారని, దోపిడీలు, హత్యలు జరిగాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గార్మెంట్‌ పరిశ్రమ తీసుకువచ్చామని, అలాగే చేతనైతే పరిటాల సునీత కూడా నియోజకవర్గానికి నూతన పరిశ్రమలు తీసుకురావాలని అన్నారు. అనంతపురంలోని కళ్యాణదుర్గంలో రోడ్డులో 68 సెంట్లలో 20 ఇళ్లు కూల్చేసి ఆ స్థలంపై కన్నేస్తే బాధితుల పక్షాన నిలిచి కోర్డుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెప్పించామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రకాష్‌రెడ్డిని విమర్శించడం మాని నియోజకవర్గ అభివృద్ధి దృష్టిపెట్టాలని హితవు పలికారు.

భూకబ్జాలు, దాడులతో విధ్వంసాలు

హంద్రీ నీవా లైనింగ్‌ పనులతో రైతులకు తీరని అన్యాయం

న్యాయం కోరుతూ ఈ నెల 29 నుంచి రాప్తాడు నియోజకవర్గంలో అన్నదాతల రిలే నిరాహార దీక్షలు

వైఎస్సార్‌సీపీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement