
ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన కురుబ విద్యార్థులకు ఆదివారం స్థానిక గుత్తి రోడ్డు లోని కనకదాస కల్యాణమంటపంలో కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కనకదాస ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కురుబ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్వేటి పద్మావతి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, అనంతపురం నగర మాజీ మేయర్ రాగే పరశురాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు తుప్పటి ఈశ్వరయ్య, ఆర్డీఓ మధులత, డాక్టర్ మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... కురుబ విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనపరచడం కులానికే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు తెచ్చుకుని తల్లిదండ్రులు, కులానికి, సమాజానికి ఉపయోగపడాలన్నారు. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్లలను బాగా చదివించాలన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు దండు వెంకటరాముడు, ప్రధాన కార్యదర్శి మంగలకుంట నాగరాజు, కోశాధికారి ఓబులేసు, అడ్వయిజరీ చైర్మన్ గజ్జల రామకృష్ణ, సూర్యనారాయణ, జనార్ధన్, ఉపాధ్యక్షులు బుల్లే ఆదినారాయణ, పాటల హరికృష్ణ, జగన్నాథ్, లక్ష్మీదేవి, శివ శంకర్, రమేష్, అక్కులప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
నాసిరకం సాఫ్ట్వేర్తో బెంబేలు
● రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల బదిలీల్లో గడువు ముగుస్తున్నా దరఖాస్తు చేసుకోవడానికి కొందరు ఉపాధ్యాయులకు ఆన్లైన్ ఓపెన్ కావడం లేదని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి వాపోయారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అప్లికేషన్ పూర్తి చేయడానికి పీఈటీలు, ఎల్పీటీలు ప్రయత్నిస్తే సైట్ ఓపెన్ కావడం లేదన్నారు. రిఅపోర్షన్కు ఎఫెక్ట్ అయినవారికి పాత స్టేషన్ పాయింట్స్ ఉపయోగించుకునేలా ఉంచిన ఎస్ బటన్ క్లిక్ చేసినా ‘0’ పాయింట్స్ వస్తున్నాయన్నారు. సబ్మిట్ చేయడానికి వెళ్తే ఎర్రర్ అని వస్తోందన్నారు. డీఈఓ ఏర్పాటు చేసిన సెంటర్కు వెళ్లి గ్రీవెన్స్ ఇచ్చినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందన్నారు. లీగలీ సెపరేట్ అయిన మహిళా ఉపాధ్యాయులు, రెండు సార్లు రీ అపోర్షన్కు గురై బదిలీకి దరఖాస్తు చేస్తే ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ ‘0’ పాయింట్స్ వస్తున్నాయన్నారు. నాసిరకం సాఫ్ట్వేర్తో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
● వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనారాయణ
అనంతపురం రూరల్: విద్య తోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వడ్డెర సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. పది ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన వడ్డెర విద్యార్థులకు ఆదివారం నగరంలోని ఒకటవ రోడ్డులో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని చదువులో రాణించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వడ్డే శ్రీరాములు, మారుతీప్రసాద్, లోకనాథ్, గంగన్న, సూర్యబాబు, రాయుడు, శంకర్, రాజశేఖర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే వాల్మీకుల అభివృద్ధి
● ఉమ్మడి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కులప్ప
బుక్కరాయసముద్రం: సమష్టి కృషితోనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యమని ఉమ్మడి జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అక్కులప్ప అన్నారు. ఆదివారం స్థానిక వాల్మీకి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి, ఇంటర్లో ప్రతిభ చాటిన 2 వేల మంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు చైతన్యకుమార్, పవన్కుమార్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ ఈశ్వర్, న్యాయవాది చంద్రశ్చర్ల హరి, కోనయ్య, అక్కులప్ప, సాకే నరేష్, తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో ఇద్దరి మృతి
శెట్టూరు: స్థానిక కర్ణాటక సరిహద్దున చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు... కళ్యాణదుర్గంలో నివాసముంటున్న శ్రీనివాసులు (28), కళ్యాణ్ (31) వ్యక్తిగత పనిపై కర్ణాటకకు వెళ్లి ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. కర్ణాటక సరిహద్దున శెట్టూరు మండలంలో ప్రవేశిస్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న కర్నాటక పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.

ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం

ఘనంగా కనకదాస పురస్కారాల ప్రదానం