
ఏలుకుంట్లలో ఘర్షణ
ధర్మవరం రూరల్: వివాహేతర సంబంధం కారణంగా ధర్మవరం మండలం ఏలుకుంట్లలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఓ వర్గానికి చెందిన విజయ్, శ్రీనివాసులు, అప్పస్వామి, లక్ష్మీనారాయణ, మరో వర్గానికి చెందిన బొగ్గు నాగరాజు, దామోదర్, సత్యమయ్య, ఓబుళమ్మకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిరుత దాడితో జింక మృతి
ఓడీచెరువు: తంగేడుకుంట పంచాయతీ గొల్లవారిపల్లిలో శనివారం సాయంత్రం ఓ చిరుత దాడిలో జింకపిల్ల మృతి చెందింది. వ్యవసాయ బోరు వద్ద పడి ఉన్న సగం జింక కళేబరాన్ని స్థానికులు గుర్తించి, సమాచారం ఇవ్వడంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు.
క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
రొళ్ల: మండలంలోని కె.బ్యాడిగెర గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న పలువురుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం రొళ్ల పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను మడకశిర రూరల్ పీఎస్ సీఐ రాజ్కుమార్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు ఆదివారం కె.బ్యాడిగెర గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద చింత చెట్టు కింద క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ ఆరుగురు పట్టుపడ్డారు. వీరి నుంచి రూ.1.02 లక్షల నగదు, ఓ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ రాయుళ్లపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో రిపోర్టర్ మృతి
ఉరవకొండ: స్థానిక 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో హెచ్ఎం టీవీ రిపోర్టర్ బోయ నాగరాజు (32) మృతిచెందాడు. బూదగవి గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఆదివారం రాత్రి ఉరవకొండ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరిన ఆయన గ్రామ శివారులోకి చేరుకోగానే రోడ్డుకు అడ్డుగా ఉన్నఫళంగా వచ్చిన గేదెను ఢీకొనడంతో వాహనం అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చాలా సేపటి తర్వాత అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ఏలుకుంట్లలో ఘర్షణ

ఏలుకుంట్లలో ఘర్షణ