● ఆటో డ్రైవర్‌ చెప్పిన నీతి పాఠం | - | Sakshi
Sakshi News home page

● ఆటో డ్రైవర్‌ చెప్పిన నీతి పాఠం

May 26 2025 1:39 AM | Updated on May 26 2025 1:39 AM

● ఆటో డ్రైవర్‌ చెప్పిన నీతి పాఠం

● ఆటో డ్రైవర్‌ చెప్పిన నీతి పాఠం

పుట్లూరు: నిజం.. ఇది ఓ ఆటో డ్రైవర్‌ చెప్పిన నీతి పాఠమే. ఇందులోని సారాంశం అర్థమైన వారు శభాష్‌ గంగరాజు అంటూ సదరు ఆటో డ్రైవర్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే... పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం నుంచి గూగూడుకు వెళ్లే మార్గం మొత్తం గుంతల మయంగా మారింది. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ఇంత కాలం ప్రభుత్వం స్పందించి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపడుతుందని, అలా కాకున్నా... కనీసం మరమ్మతులైనా చేపడుతుందని గ్రామీణులు ఆశించారు. అయినా కనుచూపు మేరలో అలాంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రహదారి మరింతగా దెబ్బతినింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు పడరాని పాట్లు పడేవారు. ఇలాంటి తరుణంలో రహదారి మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించి, పనులు చేపట్టాలంటే ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి. విషయాన్ని గమనించిన ఎల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్‌ గంగరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. స్వయంగా రంగంలో దిగి తన రోజు వారి సంపాదన రూ.1,200 చొప్పున రెండు రోజుల ఆదాయం రూ.2,400 వదులుకుని ఒంటరిగానే మట్టితో గుంతలను పూడ్చి వేశారు. అటుగా వెళుతున్న వాహనదారులు ‘ఏందయ్యా గంగరాజు... ఏమిటీ పని ఒప్పుకున్నావా?’ అన్ని ప్రశ్నిస్తే.. ‘గుంతల వల్ల రోజూ ఎవరో ఒకరు కిందపడుతూనే ఉన్నారు కదన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రమాదాలు ఏవీ జరగకూడదని మట్టితో గుంతలను పూడుస్తున్నా’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇది చూసిన పలువురు శభాష్‌ గంగరాజు అంటూ మెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement