
మడకశిరలో ఎలుగుబంటి హల్చల్
మడకశిర: పట్టణంలో గురువారం రాత్రి ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. అటుఇటూ తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఓ ఎలుగుబంటి కనిపించింది. అనంతరం అది సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో అటూ ఇటూ తిరుగుతుండగా... భయపడిన స్థానికులు పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ దాన్ని కొండ ప్రాంతంలోకి తరిమి వేశారు. గతంలో కూడా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్ల కనిపించాయి. పట్టణానికి ఆనుకుని కొండ ఉండటం, కొండపై ఉన్న ఎలుగుబంట్లు తాగునీరు, ఆహారం కోసం తరచూ పట్టణంలోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంట్లు పట్టణంలోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రైతులకు నాణ్యమైన
విత్తనాలు అందించాలి
● విత్తన ప్రాసెసింగ్ను పరిశీలించిన డీఏఓ సుబ్బారావు
ధర్మవరం రూరల్: ఖరీఫ్లో వేరుశనగ సాగుచేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) వైవీ సుబ్బారావు ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు సనావుల్లా, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ సుబ్బయ్యతో కలిసి మండలంలోని విజేత అగ్రిటెక్, సాయి సీడ్స్ విత్తన వేరుశనగ ప్రాసెసింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. మొలకశాతం పరిశీలించిన తర్వాతే విత్తనాలు పంపిణీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అన్ని రైతు సేవా కేంద్రాల్లో వేరుశనగ కాయలను నిల్వ ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా విత్తన సంచుల తూకాలు, తేమ శాతం తదితర వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ ముస్తఫా, ఏఈఓ అశ్వని, ఏపీ సీడ్స్ సిబ్బంది వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్రీజింగ్ పేరుతో
8 ఏళ్లకే సర్వీస్ పాయింట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–2014లో ఎంపికై న ఉపాధ్యాయులు 2016 జూన్లో జాయిన్ అయ్యారు. వారికి 2024 మే 31 నాటికి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అంటే తప్పనిసరిగా బదిలీ కావాలి. 2024 లో ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు జరపలేదు. దీంతో లాంగ్ స్టాండింగ్ అయినా అదే స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. ఇప్పటికి వారి సర్వీస్ 9 సంవత్సరాలు పూర్తయింది. అయితే ప్రస్తుత బదిలీల్లో ఫ్రీజింగ్ పేరుతో ఎనిమిది సంవత్సరాలకే పాయింట్లను కేటాయిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు అని 2014 డీఎస్సీ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. స్టేషన్ పాయింట్ల విషయంలో ఉపాధ్యాయుడు ఎన్ని సంవత్సరాలు పని చేస్తే అన్ని సంవత్సరాలు కేటాయించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గుజ్జల శివయ్య, ప్రధాన కార్యదర్శి డేగావత్ రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. టీచర్ల బదిలీ కోసం పెట్టుకొనే అప్లికేషన్లో స్టేషన్ సీనియారిటీ పాయింట్లు, సర్వీస్ సీనియారిటీ పాయింట్లలో పూర్తయిన సంవత్సరాలకు మాత్రమే పాయింట్లు వస్తున్నాయన్నారు. నెలలు, రోజులకు పాయింట్లు రావడం లేదన్నారు. ఫలితంగా టీచర్లు బదిలీల్లో నష్టపోతారన్నారు. ప్రస్తుత స్టేషన్ లో ఎన్ని సంవత్సరాలు పని చేస్తే పూర్తి కాలానికి పాయింట్స్ కేటాయించాలన్నారు.
నియామక జాబితాలు లేవట!
డీఎస్సీ–2002కు సంబంధించిన టీచర్ల నియామక జాబితాలు డీఈఓ కార్యాలయంలో లేవని చెబుతున్నారని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, ఎస్ఎల్టీఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గాండ్లపర్తి శివానందరెడ్డి, జిల్లా నాయకులు వై.ఆదిశేషయ్య, నరసింహారెడ్డి, ఆపస్ నాయకులు ఎర్రిస్వామి మండిపడ్డారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచుకోకపోతే ఎలా? అని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల సందేహాల నివృత్తికి డీఎస్సీల వారీగా మెరిట్ జాబితాలు అందుబాటులో ఉంచి అడక్వసి ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మడకశిరలో ఎలుగుబంటి హల్చల్