ముత్తుకూరు (పొదలకూరు): బూటకపు హామీలిచ్చి అధికారంలోకి చంద్రబాబు వచ్చారని.. ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈ రెండేళ్ల పాలనలో ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో భారీ ర్యాలీని పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, పరిశీలకుడు వీరి చలపతిరావుతో కలిసి శుక్రవారం నిర్వహించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నిరసనగా నోటిఫికేషన్ ప్రతులను దహనం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకతతోనే తమ పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. తమ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు సహకరించే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరికీ గుణపాఠాన్ని చెప్తామని స్పష్టం చేశారు. డీఆర్సీ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. ప్రభుత్వాస్తులకు తమ కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకునే అంశాలపై చర్చించడం సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని.. దీని కోసం జిల్లా వ్యాప్తంగా నిరసనలను రైతులు చేపడుతున్నారని ఆరోపించారు.


