కోవూరు: అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురై.. అందులో ప్రయాణిస్తున్న వారు మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లోని మెడికల్ కళాశాల మెస్పై కూలి మెడికోలూ మృతి చెందిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. మృతుల కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హృదయవిదారకం
ఆత్మకూరు రూరల్: అహ్మదాబాద్లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం హృదయ విదారకరమని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది, కూలిన చోట 20 మంది వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి మనస్సును కలిచి వేస్తోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): అహ్మదాబాద్లో విమానం కూలి ప్రయాణికులు మృతి చెందడం తనకు కలిచివేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఘటనలో స్థానిక మెడికల్ కళాశాల విద్యార్థులు మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
‘పది’ సప్లిమెంటరీలోనూ అంతే..
● 13వ స్థానంలో జిల్లా
● 77.55 శాతం ఉత్తీర్ణత
నెల్లూరు (టౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లోనూ జిల్లా వెనుకంజలోనే నిలిచింది. 13వ స్థానాన్ని దక్కించుకొని.. 77.55 శాతం ఉత్తీర్ణతకే పరిమితమైంది. ఫలితాలను గురువారం విడుదల చేశారు. గత నెల 19 నుంచి 28 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 4690 మంది హాజరుకాగా, 3637 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 74.97.. బాలికలు 81.11 శాతం ఉత్తీర్ణత సాధించారు. జవాబు పత్రాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
2.25 లక్షల ఎకరాలకు సాగునీరు
సంగం: జిల్లా వ్యాప్తంగా 2.25 లక్షల ఎకరాలకు ఎడగారులో సాగునీటిని అందించనున్నామని ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ తెలిపారు. సంగం బ్యారేజీ వద్ద నీటిమట్టాన్ని గురువారం పరిశీలించిన అనంతరం అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సాగునీరు వృథా కాకుండా తనిఖీలను చేపడుతున్నామని చెప్పారు. పెన్నాకు సోమశిల నుంచి పది టీఎంసీలను విడుదల చేశామని వివరించారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2023కు సంబంధించిన జీతాలను చెల్లించనున్నామని తెలిపారు. డీఈ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.
సిటీ ప్లానర్ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంలో సిటీ ప్లానర్గా హిమబిందు బాధ్యతలను గురువారం స్వీకరించారు. ఏసీపీ వేణుతో పాటు సూపరింటెండెంట్ మునిరత్నం తదితరులు ఆమెకు పుష్పగుచ్ఛాన్ని అందజేసి అభినందనలను తెలియజేశారు.