
గుంతల దారులు.. భయంగా రాకపోకలు
● ప్రమాదకరంగా వెంకటగిరి
నియోజకవర్గంలోని రోడ్లు
● మరమ్మతులు ఎప్పుడు చేస్తారో..
● నిధులు మంజూరు కాలేదంటూ పనుల నిలిపివేత
● వర్షాలకు అధ్వానంగా
మారిన రహదారులు
అధికారంలోకి రాగానే రోడ్లను అద్దంలా మారుస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కొత్త రోడ్ల నిర్మాణం సంగతి దేవుడెరుగు ఉన్న వాటిలో గుంతలను పూడ్చకుండా గాలికొదిలేశారు. ప్రకృతి వనరులను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రజలకు ఉపయోగపడే పనులపై పెట్టడం లేదు.
దారుణంగా ఉన్న సైదాపురం –
పొదలకూరు రోడ్డు
సైదాపురం: సైదాపురం – పొదలకూరు రోడ్డు ఆధునికీకరణ పనులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రూ.43 కోట్ల నిధులను మంజూరు చేసింది. 24 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి పనులు ఇప్పటికి 20 శాతం పైగానే పూర్తి చేశారు. దీని వెంబడి ఉన్న సైదాపురం, ఊటుకూరు, తురిమెర్ల, కలిచేడు గ్రామాల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణంతోపాటు మూడు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులను చేశారు. అయితే మూడు నెలల నుంచి వాటిని పూర్తిగా నిలిపివేశారు. అప్పటి నుంచి రహదారి మరింత దారుణంగా మారింది. వంతెనల వద్ద ప్రమాదకర పరిస్థితులున్నాయి. మూడు నెలల నుంచి తట్ట మట్టి కూడా పోయలేదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అడుగుకోగుంత ఏర్పడటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గుంతల్లో వాహనాలు పడి పలువురు వాహనదారులు గాయపడ్డారు.
పట్టించుకోకుండా..
రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రహదారి యథాస్థితికి చేరుకునే పరిస్థితికి వచ్చింది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ రహదారిలో దాడిశెట్టిపల్లి, మొలకలపూండ్ల, పొక్కందల, ఆదూరుపల్లి, పెరుమాళ్లపాడు, జోగిపల్లి, గిద్దలూరు, పరసారెడ్డిపల్లి, గోవిందపల్లి, తురిమెర్ల, కట్టుబడిపల్లి, దేవరవేమూరు, తలుపూరు, చేర్లోపల్లి, ఓరుపల్లి, మలిచేడు గ్రామాలున్నాయి. దీని గుండా పొదలకూరు మీదుగా నెల్లూరుకు చేరుకుంటారు. వెంకటగిరి – నెల్లూరు వెళ్లే రహదారి దారుణంగా మారింది. బాలాయపల్లి నుంచి అమ్మపాళెం వరకు రహదారి అధ్వానంగా ఉండటంతో తిరుపతి – నెల్లూరు జిల్లాలను కలిపే ఈ రహదారిపై ప్రయాణం నరకంగా మారింది. సైదాపురం – పొదలకూరు, వెంకటగిరి – నెల్లూరుతోపాటు పలు రహదారులు ఇప్పటికే గుంతలమయంగా మారాయి. వర్షాలకు గుంతలు పెద్దవిగా మారే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ రోడ్లపై 10 కిలోమీటర్ల ప్రయాణానికి అధిక సమయం పడుతోంది. ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు చెప్పిన ఓట్లు వేయించుకున్న కూటమి నేతలు ప్రకృతి వనరులను దోచుకోవడంలో బిజీ అయిపోయారు. రోడ్ల మరమ్మతులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధాంతరంగా ఆగిన సైదాపురం – పొదలకూరు రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు.
హామీలు నెరవేర్చాలి
సైదాపురం – పొదలకూరు రోడ్డు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బంది ఉంది. రోడ్డు ప్రమాదాలతో పలువురు గాయపడుతున్నారు. నియోజకవర్గంలోని వెంకటగిరి – బాలాయపల్లి వరకు రహదారి దారుణంగా మారింది. వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేయించాలి. అర్ధాంతరంగా ఆపేసిన సైదాపురం – పొదలకూరు రోడ్డుకు మరమ్మతులు పూర్తి చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
– నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి,
వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త

గుంతల దారులు.. భయంగా రాకపోకలు

గుంతల దారులు.. భయంగా రాకపోకలు