
మా పొట్ట కొట్టొద్దు
ఆత్మకూరు: ఇసుక రీచ్లో జేసీబీ, హిటాచీలను కూలీలు అడ్డుకున్నారు. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం రీచ్ నుంచి ఇసుక తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా జేసీబీ, హిటాచీలతో టిప్పర్లకు లోడ్ చేసి పంపుతామని గురువారం రీచ్ వద్దకు రావడంతో కూలీలు అడ్డుకున్నారు. నేతలు దబాయించడంతో నేరుగా వారంతా ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ బి.పావనికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 40 దళిత కుటుంబాల వారం ట్రాక్టర్లలో ఇసుక లోడ్ చేసి వచ్చే డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నామని చెప్పారు. కొందరు టీడీపీకి చెందిన మద్దతుదారులు టిప్పర్లు, జేసీబీతో రీచ్ వద్దకు వచ్చి ఇక నుంచి ఇసుక లోడింగ్ యంత్రాలతో చేయనున్నట్లు చెప్పడంతో అడ్డుకున్నామని తెలిపారు. నేతల్ని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోవాలని దబాయించడంతో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చామన్నారు. తమను రోడ్డున పడేయొద్దని వేడుకున్నారు. స్పందించిన ఆర్డీఓ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
అధునాతన వైద్యం చేసి ప్రాణాలు కాపాడాం
నెల్లూరు(అర్బన్): కోమాలో ఉన్న ఓ వ్యక్తికి అధునాతన వైద్యసేవలందించి ప్రాణాలు కాపాడామని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ పి.విజయ్కుమార్ తెలిపారు. గురువారం ఆస్పత్రిలో వివరాలు వెల్లడించారు. సూళ్లూరుపేటకు చెందిన యువకుడు ఈనెల 22న రాత్రి ప్రమాదకరమైన యాంటీ సైకోటిక్ మాత్రలను పెద్ద మొత్తంలో మింగడంతో కోమాలోకి వెళ్లిపోయాడన్నారు. 23వ తేదీ తెల్లవారుజామున గమనించిన కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి డాక్టర్ల సూచన మేరకు మెడికవర్కు తీసుకొచ్చారన్నారు. తక్షణమే ఐసీయూలో చేర్చి దశలవారీగా చికిత్స అందించామన్నారు. హార్ట్ బీట్ను, కిడ్నీ పనితీరును, బీపీని సాధారణ స్థితికి తెచ్చి రోగిని బతికించామన్నారు.
ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్కు అనుమతి
సైదాపురం: ప్రజల అభిప్రాయాల మేరకే మైనింగ్ లీజుకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషి అనూష వెల్లడించారు. మండలంలోని గోకుల బృందావనం గ్రామ సమీపంలో గురువారం ధ్వని ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మొలకలపూండ్లలోని 804 – పీ, 806 – పీ2లో 32.758 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. మైనింగ్తో ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు స్పష్టం చేశారు. పర్యావరణ అధికారి అశోక్కుమార్, గని యజమాని షేక్ జాఫర్, తహసీల్దార్ రమాదేవి, సర్పంచ్ శారద, గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మా పొట్ట కొట్టొద్దు