
ఆర్టీసీ.. తెలుగుదేశం సేవలో..
వెలవెలబోతున్న బస్టాండ్
నెల్లూరు సిటీ: కడపలో జరిగిన మహానాడు కార్యక్రమానికి 263 ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేసవి సెలవులు కావడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, వచ్చేవారు బస్సులు అందుబాటులో లేక పడిగాపులు కాయాల్సి వచ్చింది. జిల్లా నుంచి మొత్తం 263 ఆర్టీసీ బస్సులను అధికారులు తెలుగుదేశం మహానాడుకు కేటాయించారు. నెల్లూరు డిపో–1 నుంచి 45, డిపో–2 నుంచి 51, ఆత్మకూరు నుంచి 50, కావలి నుంచి 25, ఉదయగిరి నుంచి 50, కందుకూరు నుంచి 17, రాపూరు నుంచి 25 బస్సులు వెళ్లాయి.
ప్రయాణికుల ఎదురుచూపులు
నెల్లూరులోని డిపో–1, డిపో–2ల నుంచి నిత్యం అనేకమంది బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. గురువారం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవి సెలవుల నేపథ్యంలో వేల సంఖ్యలో ప్రయాణికులు ఊర్లకు వెళ్లేందుకు బస్టాండ్లకు వచ్చారు. అయితే గంటల తరబడి వేచి చూసినా బస్సులు రాకపోవడంతో కొందరు వెనుతిరిగారు. మరికొందరు అధికంగా ఖర్చు చేసి ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు బయలుదేరారు. పార్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బస్సులు తరలించడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మహానాడుకు జిల్లా నుంచి 263 బస్సులు
వేసవి సెలవుల నేపథ్యంలో
ప్రజలకు ఇబ్బందులు