
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
వివిధ మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
సంగం: చెట్టును ఆటో ఢీకొన్న ఘటనలో డ్రైవర్కు తీవ్రంగా గాయపడిన ఘటన సంగం – కలిగిరి రహదారిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఏఎస్పేటకు చెందిన ఖాదర్బాషా అనే డ్రైవర్ తన ఆటోలో ఇద్దరు యువకులను ఎక్కించుకుని సంగం బయలుదేరాడు. సంగంకు కూతవేటు దూరంలో కలిగిరి రహదారిలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి చెట్టును ఢీకొట్టాడు. దీంతో హ్యాండిల్ విరిగి అతడి ఎడమ తోడలోకి చొచ్చుకుపోయింది. యువకులు అటుగా వెళ్తున్న వాహనదారులను ఆపి ఖాదర్బాషాను బయటకు తీశారు. 108 అంబులెన్స్లో వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై..
మర్రిపాడు: మండలంలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వివరాలు.. నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై నందవరం కూడలి వద్ద బస్సును కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు చిన్నారులతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అదే హైవేపై గంగుంట వద్ద లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఇస్కపల్లికి చెందిన చిన్నయ్యగా గుర్తించారు. ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు