
8 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచార కరపత్రాలు, పోస్టర్లనును వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసులరెడ్డి, ఆలయ ప్రధానార్చకులు సీతారామయ్యస్వామి, బ్రహ్మోత్సవాల ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్రెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
కొరవడిన ప్రచారం
పెంచలకోనలో జరిగే బ్రహ్మోవాలకు రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా నెలూరు, తిరుపతి, చిత్తూరు, ఒంగోలు, వైఎస్సార్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. గతంలో సుమారు 50 రోజుల ముందే పోస్టర్లను ఆయా జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో అంటించి ప్రచారం నిర్వహించేవారు. పెంచలకోన దేవస్థానంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించే ఉభయదాతలకు కరపత్రాలు అందించేవారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో పాలక మండలితోపాటు దేవదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వారం ముందు కరపత్రాలు, పోస్టర్లు ఆవిష్కరించడం చూస్తే అందరికీ తెలిసేదెలా అని భక్తులు మండి పడుతున్నారు.