Virat Kohli, Sourav Ganguly Shake Hands Amid Reports Of Rift - Sakshi
Sakshi News home page

DC VS RCB: కోహ్లి, గంగూలీ కలిసిపోయారు.. కోహ్లి ఇక ఢిల్లీకి వచ్చేయ్‌..!

May 7 2023 12:34 PM | Updated on May 7 2023 1:45 PM

Virat Kohli, Sourav Ganguly Shake Hands Amid Reports Of Rift - Sakshi

ఆర్సీబీ కీ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి, ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ సౌరవ్‌ గంగూలీ చాలాకాలంగా తమ మధ్య నెలకొన్న విభేదాలకు స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. నిన్న (మే 6) ఆర్సీబీ-డీసీ జట్ల మధ్య మ్యాచ్‌ అనంతరం వీరిరువురు ఆప్యాయంగా కరచాలనం చేస్తూ, ఒకరి భజం మరొకరు తట్టుకుంటూ కనిపించారు. ఈ సీన్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.

కోహ్లి, దాదా కలిసిపోయారని భారత క్రికెట్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. డీసీ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి.. గంగూలీతో వివాదం సమసిపోయింది కదా కోహ్లి.. ఆర్సీబీని వదిలేసి తమ జట్టుకు వచ్చేయ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కోహ్లి అభిమానులు సైతం తమ ఆరాధ్య క్రికెటర్‌ గంగూలీతో హుందాగా వ్యవహరించడం పట్ల హర్షిస్తున్నారు. 

కాగా, గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్సీ విషయంలో కోహ్లితో మొదలైన వివాదం నిన్న మొన్నటి వరకు సాగింది. ఈ మధ్యలో అనేక సందర్భాల్లో వీరు బహిరంగానే ఒకరితో ఒకరు విభేదించారు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనే డీసీతో జరిగిన తొలి మ్యాచ్‌ సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు కనిపించాయి. ఆ మ్యాచ్‌లో వీరిద్దరూ ఎదురెదురు పడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండా తప్పించుకున్నారు.

తొలుత కోహ్లి ఏదో మనసులో పెట్టుకుని గంగూలీ వైపు కోపంగా చూడగా.. ఆతర్వాత ఇరువురు షేక్ హ్యాండ్‌ ఇచ్చుకునే తరుణంలో (మ్యాచ్‌ అనంతరం) కోహ్లిని చూసి గంగూలీ తప్పుకున్నాడు. దీంతో కోహ్లికి చిర్రెత్తిపోయి వెనక్కు తిరిగి గంగూలీవైపు మరోసారి బిర్రుగా చూశాడు. గంగూలీ చర్యకు బదులుగా కోహ్లి.. ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో చేసి, తమ మధ్య అగాధాన్ని మరింత పెంచుకున్నాడు.

అయితే దాదా.. తాను కూడా తగ్గేదేలేదంటూ ఇన్‌స్టాలో కోహ్లిని అన్‌ ఫాలో చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందని అభిమానులు అనుకున్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా నిన్నటి మ్యాచ్‌ అనంతరం కోహ్లి-గంగూలీ ఆప్యాయంగా ఒకరికొకరు షేక్ హ్యాండ్‌ ఇచ్చుకోవడంతో ఇరువురి అభిమానులు ఆనందం వ్య​క్తం చేస్తున్నారు. 

చదవండి: గంభీర్‌, గంగూలీలతో వివాదం.. బీసీసీఐకి కోహ్లి లేఖ

ఇదిలా ఉంటే, ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 6) జరిగిన మ్యాచ్‌లో  ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్‌ సాధించినప్పటికీ.. దాన్ని డిఫెండ్‌ చేసుకోవడంలో విఫలమై దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కోహ్లి (55), మహిపాల్‌ లోమ్రార్‌ (54 నాటౌట్‌), డుప్లెసిస్‌ (45) రాణించడంతో ఆర్సీబీ 181 పరుగులు చేయగా.. ఛేదనలో ఫిలిప్‌ సాల్ట్‌ (87) చెలరేగడంతో ఢిల్లీ మరో 20 బంతులు మిగిలుండగానే సునాయాస విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలోవార్నర్‌ (22), మిచెల్‌ మార్ష్‌ (26) ఓ మోస్తరుగా రాణించగా.. రిలీ రొస్సో (35 నాటౌట్‌), అక్షర్‌ పటేల్‌ (8 నాటౌట్‌) డీసీని విజయతీరాలకు చేర్చారు. 

చదవండి: కోహ్లిని మరోసారి రెచ్చిగొట్టిన నవీన్‌ ఉల్‌ హక్‌.. గంభీర్‌ మద్దతు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement