వాటిని మర్చిపోయారా.. మీ గురించి ఆలోచించడం వేస్ట్: కోహ్లి
Published
Sat, Oct 30 2021 7:03 PM
అబుదాబి: టీ20 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యచ్లో టీమిండియా పరాజయం చవిచూడగా, అందుకు పేసర్ మహ్మద్ షమీనే కారణమంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. కొందరు దురాభిమానులు షమీని టార్గెట్ చేస్తూ నెట్టింట రెచ్చిపోయారు. షమీ రాణించలేకపోవడంతో పాక్కు అమ్ముడుపోయాడంటూ ట్రోల్ చేశారు. కాగా, ఈ విషయంలో షమీకి ఇప్పటికే పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలవగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం అండగా నిలిచాడు. కేవలం షమీని టార్గెట్ చేయడాన్ని, అందులోనూ మతాన్ని ఎత్తిచూపుతూ విమర్శలు చేయడాన్ని కోహ్లి తీవ్రంగా ఖండించాడు.
న్యూజిలాండ్తో ఆదివారం జరగబోయే మ్యాచ్లో భాగంగా ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్పరెన్స్లో మాట్లాడిన కోహ్లి.. ‘ఎవరి మీదా కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదు. ఇక్కడ మతపరమైన అంశాన్ని మూడిపెట్టడం చాలా దారుణం. వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉన్నా.. ఇక్కడ కొన్ని హద్దులు ఉంటాయి. అవి దాటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. గతంలో టీమిండియాకు షమీ ఎన్నో విజయాలు అందించాడు.. అవి మరిచిపోయారా.. మరుగున పడేశారా?, మీలాంటి వాళ్లు(దురహంకారంతో వ్యాఖ్యలు చేసే వాళ్లను ఉద్దేశిస్తూ) గురించి ఆలోచించకూడదు. ఇలా వ్యాఖ్యానించే వారి గురించి ఒక నిమిషం ఆలోచించినా అది వృధానే అవుతుంది. మేము జట్టుగా 200 శాతం షమీకి అండగా ఉన్నాం. మేముంతా సోదర భావంతో ఉన్నాం. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది’ అని కోహ్లి స్పష్టం చేశాడు. చదవండి:T20 World Cup 2021: ధోని వద్దన్నా.. కోహ్లి వినలేదా?