
ఎస్వీ రాహుల్ (203 నాటౌట్ )
ఎస్డీఎన్వీ ప్రసాద్ (94 పరుగులు)
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర ఆటగాడు ఎస్వీ రాహుల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. వికెట్ కీపర్ ఎస్డీఎన్వీ ప్రసాద్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 630/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఢిల్లీ జట్టు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఎదురీదుతోంది. వివరాలిలా ఉన్నాయి. సీకే నాయుడు ట్రోఫీ అండర్–23లో భాగంగా శనివారం అనంత క్రీడా గ్రామంలో మూడో రోజు ఓవర్నైట్ స్కోర్ 470/4తో ప్రారంభించిన ఆంధ్ర జట్టు స్కోర్ వేగాన్ని చకచకా పెంచింది.
ఎస్వీ రాహుల్, వికెట్ కీపర్ ప్రసాద్లు ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. అవకాశం దొరికినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఎస్వీ రాహుల్ 386 బంతుల్లో 18 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సహాయంతో 203 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మరో బ్యాటర్ ప్రసాద్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 94 పరుగులు చేశాడు. రాహుల్, ప్రసాద్లు ఆరో వికెట్కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ బౌలర్లలో దేవ్ లక్ర, మన్నన్ భరద్వాజ్, యుగల్ షైనీ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ఢిల్లీ 200/5
ఆంధ్ర బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆటముగిసే సమయానికి 63 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. జట్టులో ఆల్రౌండర్ దేవ్ లక్ర 91 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నాటౌట్గా నిలిచాడు. యుగల్ షైనీ 44 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్ ఆదిత్యరెడ్డి 3/39 వికెట్లు తీసుకుని ఢిల్లీని కట్టడి చేశాడు.