
మహిళల వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం వాన అంతరాయం కలిగించిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. వర్షంతో కొలంబోలో మూడు మ్యాచ్లు రద్దయిన తర్వాత ఎట్టకేలకు ‘టి20’ ఫార్మాట్లో ఫలితం రావడం విశేషం. టాస్ గెలిచిన లంక 12 ఓవర్లలో లంక 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.
ఈ దశలో భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు ఆట నిలిచిపోయింది. చివరకు అంపైర్లు మ్యాచ్కు 20 ఓవర్లకు కుదించారు. 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 105 పరుగులు సాధించింది. విష్మి గుణరత్నే (34; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా... ఎంలాబా 3, క్లాస్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్వర్త్–లూయిస్ పద్ధతి ప్రకారం 20 ఓవర్లలో 121 పరుగులుగా నిర్దేశించారు. దక్షిణాఫ్రికా జట్టు 14.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ లారా వోల్వార్ట్ (47 బంతుల్లో 60 నాటౌట్; 8 ఫోర్లు), తజ్జీమన్ బ్రిట్స్ (42 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయంగా మ్యాచ్ను ముగించారు. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్తో న్యూజిలాండ్ తలపడుతుంది.
చదవండి: పాకిస్తాన్ దాడి.. ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్ల మృతి