‘ఫైవ్స్‌ వరల్డ్‌ కప్‌’లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా రజని  | Rajani is the captain of the Indian womens team | Sakshi
Sakshi News home page

‘ఫైవ్స్‌ వరల్డ్‌ కప్‌’లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా రజని 

Jan 1 2024 4:18 AM | Updated on Jan 1 2024 4:18 AM

Rajani is the captain of the Indian womens team - Sakshi

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఎఫ్‌ఐహెచ్‌ అధికారికంగా నిర్వహించే ఈ టోర్నీ ఒమన్‌లోని మస్కట్‌లో జనవరి 24నుంచి 27 వరకు జరుగుతుంది. గోల్‌కీపర్‌ రజని భారత్‌కు 96 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది.

భారత జట్టుకు మహిమా చౌదరి వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా...బన్సారి సోలంకి, అక్షతా అబాసో ఢేకలే, జ్యోతి ఛత్రి, మరియానా కుజుర్, ముంతాజ్‌ ఖాన్, అజ్మినా కుజుర్, రుతుజ దాదాసొ పిసాల్, దీపిక సోరెంగ్‌ ఇతర జట్టు సభ్యులు. టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్‌ ‘సి’లో భారత్‌తో పాటు నమీబియా, పోలండ్, అమెరికా ఉన్నాయి.

ఫిజి, మలేసియా, నెదర్లాండ్స్, ఒమన్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, జాంబియా, న్యూజిలాండ్, పరాగ్వే, థాయిలాండ్, ఉరుగ్వే కూడా పాల్గొంటున్నాయి. ఆ తర్వాత జనవరి 28నుంచి 31 వరకు జరిగే పురుషుల ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో భారత సారథిగా సిమ్రన్‌జిత్‌ సింగ్‌ ఎంపికయ్యాడు.   సూరజ్‌ కర్కేరా, ప్రశాంత్‌ కుమార్, మన్‌దీప్‌ మోర్, మంజీత్, రాహీల్, మణీందర్, పవన్‌ రాజ్‌భర్, గుర్జోత్‌ సింగ్, ఉత్తమ్‌ సింగ్‌  జట్టులో ఇతర సభ్యులు. 

Advertisement
 
Advertisement
Advertisement