షాంఘై: ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీ కాంపౌండ్ విభాగం క్వాలిఫయింగ్ రౌండ్లో భారత ప్లేయర్లు రాణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ, ప్రపంచ మాజీ చాంపియన్ అదితి స్వామి, ప్రగతిలతో కూడిన భారత బృందం క్వాలిఫయింగ్లో 2092 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచింది. అదితి 700 పాయింట్లతో 13వ స్థానంలో, ప్రగతి 697 పాయింట్లతో 19వ స్థానంలో, జ్యోతి సురేఖ 695 పాయింట్లతో 21వ స్థానంలో, మధుర 690 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచారు.
జట్టు స్థానాన్ని ఖరారు చేసేందుకు ఆయా దేశాల టాప్–3 క్రీడాకారిణుల స్కోర్లను లెక్కలోకి తీసుకుంటారు. మెక్సికోలో జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నిలో జ్యోతి సురేఖ బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. మరోవైపు ప్రపంచ మాజీ చాంపియన్ ఓజస్ దేవ్తలే, సాహిల్, కుశాల్లతో కూడిన భారత పురుషుల కాంపౌడ్ జట్టు క్వాలిఫయింగ్లో 2130 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత జట్టు రెండో రౌండ్లో జర్మనీ తో ఆడుతుంది. భారత మహిళల కాంపౌండ్ జట్టు తొలి రౌండ్లో సింగపూర్ జట్టును ఢీ కొంటుంది.


