
దుబాయ్: మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు భారత బుకీ నుంచి నజరానా తీసుకున్నట్లు తేలడంతో... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెటర్లు అమిర్ హయత్, అష్ఫక్ అహ్మద్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝుళిపించింది. ఈ ఇద్దరిపై ఏకంగా ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. జన్మతః పాకిస్తాన్ ఆటగాళ్లయిన వీళ్లిద్దరు యూఏఈలో జరిగిన టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్ల్ని ఫిక్స్ చేసేందుకు భారత బుకీతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఐసీసీ అవినీతి నిరోధక ట్రైబ్యునల్ విచారణలో ఇద్దరు 4,083 డాలర్లు (రూ.3 లక్షలు) నగదు, 750 డాలర్ల (రూ.55,950) పైచిలుకు విలువైన బహుమతులు తీసుకున్నట్లు అంగీకరించారు. వీరిపై ఆరోపణలు రావడంతో గతేడాదే ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఆ పాత తేదీల ప్రకారం 2020, సెప్టెంబర్ 13 నుంచి నిషేధ కాలాన్ని పరిగణిస్తారు.
ఇక్కడ చదవండి: శ్రీలంకతో చివరి వన్డే: హార్డ్ హిట్టర్ వచ్చేస్తున్నాడు