బీఆర్ఎస్కు ఓట్లడిగే హక్కే లేదు
● గత ప్రభుత్వంలో అంతా అవినీతే..
● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్: పదేళ్లల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చని బీఆర్ఎస్ పార్టీకి ఓట్లడిగే హక్కే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గురువారం పట్టణంలోని 5, 6,7వ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. ఆటో నడుపుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంతా అవినీతి పాలనే జరిగిందన్నారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి సెట్విన్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు లేన్ల రహదారి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గత పదేళ్లలో గౌరవెల్లి ప్రాజెక్టు కోసం ఉద్యమాలు చేశామన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఇల్లు కట్టించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని తెలిపారు. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని స్థానాల్లో గెలిచినప్పుడే హుస్నాబాద్కు మరింత కీర్తి పెరుగుతుంది. ఎన్నికలు అయ్యేంత వరకు ప్రతి ఓటరుపై దృష్టి పెట్టి పని చేయాలని, చేసిన అభివృద్ధిని ఇంటింటా వివరించాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి పిలుపునిచ్చారు.


