ఫైర్‌ సేఫ్టీకి పాతర | - | Sakshi
Sakshi News home page

ఫైర్‌ సేఫ్టీకి పాతర

Jul 11 2025 12:50 PM | Updated on Jul 11 2025 12:50 PM

ఫైర్‌ సేఫ్టీకి పాతర

ఫైర్‌ సేఫ్టీకి పాతర

అగ్ని ప్రమాదాల నివారణకు కనీస నిబంధనలు పాటించని సిగాచీ

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న పరిశ్రమ ఆగడాలు

రెండు రోజుల క్రితం కేసు నమోదు చేసిన అగ్నిమాపకశాఖ

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పదుల సంఖ్యలో అమాయక కార్మికుల ప్రాణాలను బలిగొన్న సిగాచీ పరిశ్రమ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలో కనీస భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యం..ఇటు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలకు సైతం పాతర వేసినట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో తేలింది. జూన్‌ 30న జరిగిన ఈ భారీ పేలుడు ఘటనలో ఇప్పటికే 44 మంది మృతి చెందగా, ఎనిమిది మంది ఆచూకీలేకుండా పోయారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 52కు చేరింది. మరో 16 మంది ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.

అగ్నిమాపకశాఖ నిబంధనల ప్రకారం ఫ్యాక్టరీల ఆటోమెటిక్‌ స్పింక్లర్‌ సిస్టం ఉండాలి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఈ స్పింక్లర్లు తెరుచుకుని అగ్ని కీలలను ఆర్పే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ ఈ పరిశ్రమలో ఈ సిస్టం లేదని ఆశాఖ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అలాగే ఆటోమెటిక్‌ డిటెక్టర్‌ సిస్టం కూడా అమర్చుకోవాలి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండకుండా తక్షణం స్పందించేలా ఈ సిస్టం పనిచేస్తుంది. కానీ, ఆటోమెటిక్‌ డిటెక్టర్‌ కూడా లేదు. ఫోమ్‌ఆధారిత అగ్ని నిరోధక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంచుకోవాల్సి ఉండగా, రూ.వందల కోట్ల లాభాలను ఆర్జిస్తున్న యాజమాన్యం ఈ అగ్ని ప్రమాదాల నివారణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోలేదు.

మంటలార్పేందుకు నీళ్ల సంపు కూడా లేదు

పరిశ్రమలోనైనా కనీసం లక్ష లీటర్లు సామర్థ్యంతో కూడిన నీళ్ల సంపు, దానికి కరెంట్‌, డీజిల్‌తో నడిచే మోటార్లు ఉండాలి. కనీసం ఈ చిన్న ఏర్పాట్లు కూడా చేయలేదంటే యాజమాన్య నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

● ఉత్పత్తి కొనసాగే ప్రొడక్షన్‌ బ్లాక్‌ పైనే అడ్మిన్‌ బ్లాకు ఉంది. ఈ బ్లాకుకు ఎమర్జెనీ డోర్లు ఎమ ర్జెనీ మెట్లు కూడా లేవు. బయటకు దారిచూపే సైన్‌బోర్డులు ఉండాలి. ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుక్ను వారు ఈ ఎమర్జెన్సీ డోర్లు లేక పైప్‌లైన్‌లు పట్టుకుని కిందికి దూకినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.

● ఫైర్‌ ఇంజన్‌ తిరిగేంత స్థలం ఫ్యాక్టరీ చుట్టూ ఉండాలి. కానీ ఈ ఫ్యాక్టరీకి ఆ స్థలం కూడా లేదు. రెండు వైపులా పబ్లిక్‌ రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇలా అగ్ని మాపకశాఖకు సంబంధించిన ఏ ఒక్క నిబంధనను కూడా పరిశ్రమ యాజమాన్యం పాటించలేదంటే నిరుపేద కార్మికులు, ఉద్యోగుల ప్రాణాల పట్ల ఆ యాజమాన్యానికి ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

జేఎఫ్‌సీఎం కోర్టులో విచారణ

సిగాచీ పరిశ్రమపై అగ్నిమాపకశాఖ కూడా తాజాగా కేసు నమోదు చేసింది. తెలంగాణ ఫైర్‌ సర్వీసెస్‌ యాక్టు –1999 సెక్షన్‌ 31, 31ల కింద ఈ నెల 7న సంగారెడ్డి అగ్నిమాపకశాఖ అధికారులు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా జేఎఫ్‌సీఎం కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. అగ్నిమాపకశాఖకు సంబంధించి కనీస నిబంధనలు పాటించకుండా... నిర్లక్ష్యం చేసినందుకుగాను ఈ కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపకశాఖ అధికారు లు తెలిపారు. అన్ని శాఖల మాదిరిగానే అగ్నిమాపక శాఖ ప్రమాదం జరిగాక..అమాయక కార్మికుల ప్రాణాలు పోయాక చర్యలకు ఉపక్రమించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement