నేతకార్మికులు కావలెను | - | Sakshi
Sakshi News home page

నేతకార్మికులు కావలెను

Jun 14 2025 10:24 AM | Updated on Jun 14 2025 10:24 AM

నేతకా

నేతకార్మికులు కావలెను

సిరిసిల్ల: వస్త్రోత్పత్తికి నైపుణ్యం గల నేతకార్మికుల కొరత వేధిస్తోంది. తరచూ వస్త్రవ్యాపారంలో సంక్షోభం తలెత్తుతుండడంతో వస్త్రోత్పత్తి నిలిచిపోతుంది. దీంతో కార్మికులకు పని దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే చాలా మంది నైపుణ్యం గల కార్మికులు ఇతర రంగాల వైపు మళ్లిపోయారు. ఒకప్పుడు పుష్కలమైన ఉపాధి దొరకడంతో ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన నేతకార్మికులు ఇక్కడికి వలస వచ్చారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు లేక.. వచ్చినా నూలు అందుబాటులో లేక తరచూ సాంచాలు బంద్‌ పడుతుండడంతో సరిగ్గా పనిలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక నేతకార్మికులు సైతం నమ్మకం లేని వస్త్రోత్పత్తిపై ఆధారపడకుండా కొందరు ఆటోలు కొనుక్కోగా.. మరికొందరు ఊరూరా తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇలా వస్త్రోత్పత్తి రంగానికి ఒక్కొక్కరుగా దూరమయ్యారు.

ఉత్తరాది కార్మికులపైనే ఆధారం

స్థానికంగా నైపుణ్యం గల నేతకార్మికుల కొరత ఏర్పడడంతో కొందరు ఆసాములు బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పిస్తున్నారు. భీవండీ, ముంబయి వంటి పట్టణాల్లో పవర్‌లూమ్స్‌ నడిపిన అనుభవం ఉన్న ఉత్తరాది కార్మికులను సిరిసిల్లకు రప్పిస్తున్నారు. అయినా వస్త్రపరిశ్రమ అవసరాల మేరకు ఉత్తరాధి కార్మికులు పూర్తి స్థాయిలో రావడం లేదు.

మహిళాశక్తి చీరల ఉత్పత్తికి విఘాతం

రాష్ట్రంలోని మహిళలకు ఏటా రెండు చీరలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందించింది. ప్రస్తుతం రెండు విడతల్లో 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను 130 మ్యాక్స్‌ సంఘాలకు అందించారు. ఒక్కో మీటరుకు రూ.34 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. బట్టను నేసే కార్మికుడికి రూ.5.25 చొప్పున చెల్లించాలని ఒప్పందం చేశారు. సొంతంగా వస్త్రోత్పత్తి చేయలేని మ్యాక్స్‌ సంఘాలకు ప్రభుత్వమే నూలు డిపో ద్వారా యారన్‌(నూలు)ను సరఫరా చేస్తుంది. దీంతో వస్త్రోత్పత్తిదారులపై నూలు కొనుగోలు భారం తప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలోని సుమారు 66 లక్షల మంది మహిళలకు ఒక్కో చీరను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. పని నిదానంగా సాగుతోంది. సిరిసిల్లలో డాబీ, జకార్డ్‌ పరికరాలను అమర్చిన సాంచాలు 17 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం 4,230 సాంచాలపై మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. రోజుకు 1.25లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 32వేల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అనేక మంది ఆసాములకు సాంచాలు ఉన్నా.. బట్ట నేసేందుకు కార్మికులు లేక ఖాళీగా ఉంటున్నాయి. కార్మికుల కొరతతో పొద్దాంత మాత్రమే వస్త్రోత్పత్తి సాగుతుంది. రాత్రి వేళల్లో సాంచాలు బంద్‌ ఉంటున్నాయి.

సిరిసిల్లలో పవర్‌లూమ్‌ వర్కర్ల కొరత ఇతర పనుల్లో స్థిరపడిన నేతకార్మికులు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులతో వస్త్రోత్పత్తి మహిళాశక్తి చీరల ఆర్డర్లు.. దొరకని కార్మికులు

విచిత్ర పరిస్థితి

పనులు లేక నేతకార్మికులు రోడ్డున పడే పరిస్థితులు ఒకప్పుడు ఉండగా.. ఇప్పుడు కార్మికులు లేక సాంచాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా యువకులు ఈ పని చేసేందుకు ముందుకు రావడం లేదు. పొరుగు రాష్ట్రాల కార్మికులను తెచ్చుకునే పరిస్థితులు రావడంతో వారు గంటల తరబడి రెస్ట్‌ లేకుండా పని చేయడంతో వారితో స్థానిక కార్మికులు పోటీ పడలేక, వస్త్రోత్పత్తి పనికి దూరమవుతున్నారు.

కార్మికులు దొరకడం లేదు

ఇతను చందా రాజమౌళి. గణేశ్‌నగర్‌కు చెందిన రాజమౌళి వద్ద 48 సాంచాలు ఉన్నాయి. కానీ పవర్‌లూమ్‌ వర్కర్లు లేక రాజమౌళితోపాటు మరొకరు మాత్రమే మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకా ఏడుగురు నేతకార్మికులు అవసరం. కానీ నైపుణ్యం గల కార్మికులు దొరక్క సాంచాలు నడవడం లేదు. ఇలాంటి పరిస్థితి సర్ధార్‌నగర్‌కు చెందిన వస్త్రోత్పత్తిదారులు మండల సత్యం, బూట్ల సతీశ్‌కుమార్‌లు నేతకార్మికుల కోసం నిరీక్షిస్తున్నారు.

ఇతను బిహార్‌ రాష్ట్రం మధుబని జిల్లా పూర్‌సోలియాకు చెందిన జమీర్‌. స్థానికంగా ఓ కార్ఖానాలో పనిచేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు పనిచేస్తూ పాలిస్టర్‌ బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.14వేలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మహిళా శక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.26వేలు సంపాదిస్తున్నాడు. జమీర్‌ లాగే ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌లకు చెందిన 200 మంది కార్మికులు సిరిసిల్లలో పనిచేస్తున్నారు.

ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు వచ్చాయి. బట్ట నేసేందుకు కార్మికులు లేరు. చాలా మంది ఆసాములు, వస్త్రోత్పత్తిదారులు కార్మికుల కోసం వెతుకుతున్నారు. మా కార్ఖానాలోనే నలుగురు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క పూటనే పనిచేయిస్తూ.. సాంచాలు బందుపెట్టుకుంటున్నారు. పొరుగు జిల్లాలకు వెళ్లిపోయిన వారు తిరిగి రావడం లేదు. కార్మికుల కొరత తీవ్రంగా ఉంది.

– ఆడెపు భాస్కర్‌, పాలిస్టర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సిరిసిల్ల

నేతకార్మికులు కావలెను 1
1/3

నేతకార్మికులు కావలెను

నేతకార్మికులు కావలెను 2
2/3

నేతకార్మికులు కావలెను

నేతకార్మికులు కావలెను 3
3/3

నేతకార్మికులు కావలెను

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement