
నేతన్నలకు వరం త్రిఫ్ట్
● చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు రాఘవరావు
సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం మరమగ్గాల కార్మికులకు తెలంగాణ నేతన్న పొదుపు(త్రిఫ్ట్ ఫండ్) పథకాన్ని ప్రారంభించిందని జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు జి.రాఘవరావు గురువారం తెలిపారు. జిల్లాలోని మరమగ్గాల(పవర్లూమ్స్) కార్మికులు, అనుబంధ రంగాలు డైయింగ్, డిజైనింగ్, వార్ఫిన్, వైండింగ్, సైజింగ్, వైపని, బ్లీచింగ్, రోలింగ్ (గమ్మింగ్) కార్మికులు అర్హులని వివరించారు. గతంలో 36 నెలలు ఉన్న పథకాన్ని రెండేళ్లకు కుదించారని పేర్కొన్నారు. మరమగ్గాల కార్మికులు నెలకు గరిష్ఠంగా రూ.1,200, అనుబంధ రంగాల కార్మికులు రూ.800 చెల్లిస్తే అంతే మొత్తంలో ప్రభుత్వం జమచేస్తుందని తెలిపారు. మొత్తం డబ్బును వడ్డీతో సహా కలిపి కార్మికులకు 24 నెలల తర్వాత వస్తాయని వివరించారు. జూన్ 9 నుంచి 19 వరకు ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉందన్నారు.