
డంపుయార్డులో మంటలు పునరావృతం కానివ్వం
● విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తాం ● మున్సిపల్ కమిషనర్ వాణి
సిరిసిల్ల: జిల్లా కేంద్రం శివారులోని మున్సిపల్ డంపుయార్డులో మంటలు పునరావృతం కానివ్వబోమని మున్సిపల్ కమిషనర్ పోసు వాణి గురువారం స్పష్టం చేశారు. డంపుయార్డులో చెలరేగుతున్న మంటలపై ‘పచ్చని గుట్టల్లో ‘చెత్త’ మంటలు’ శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి స్పందించారు. తడి చెత్తతో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నామని, పొడి చెత్తను వేరు చేసి మెప్మా మహిళా సంఘాల ద్వారా రీసైక్లింగ్ చేస్తున్నామని వివరించారు. డంపుయార్డులోని చెత్తలో లభించే రాగితీగల కోసం గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లోలో మంటలు పెడుతున్నారని, ఎండల తీవ్రతతో కొన్నిసార్లు ఆ మంటలు చెలరేగుతున్నాయని తెలిపారు. మంటలను గమనించిన వెంటనే అగ్నిమాపక కేంద్రం అధికారుల సహకారంతో ఆర్పివేస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పొడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

డంపుయార్డులో మంటలు పునరావృతం కానివ్వం