
సర్కారు బడికే జై
● బడిబాటతో పెరిగిన ప్రవేశాలు ● కొత్తగా 1,276 అడ్మిషన్లు ● ప్రైవేట్లో ఫీజుల మోతతో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు ● ప్రభుత్వ పాఠశాలల వైపు చూపు ● నేటి నుంచి తెరుచుకోనున్న బడులు
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలలు సాధిస్తున్న ఫలితాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు.. ప్రైవేట్లో బాదుతున్న ఫీజుల మోతతో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బడిబాటలో జిల్లా వ్యాప్తంగా కొత్తగా 1,276 అడ్మిషన్లు రావడమే ఇందుకు నిదర్శనం. గతేడాది 183 రాగా.. ప్రస్తుతం ఇంత పెద్ద మొత్తంలో ప్రవేశాలు రావడంతో గురువారం నుంచి తెరుచుకోనున్న స్కూళ్లకు ఉపాధ్యాయులు రెట్టించిన ఉత్సాహంతో వెళ్తున్నారు. రెండు నెలలపాటు వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు.
● సర్కారు బడులే నయం
ఫీజుల నుంచి మొదలుకొని చదువుల విషయంలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుండడంతో ప్రభుత్వ బడుల వైపు తల్లిదండ్రులు చూస్తున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి మొదలైన బడిబాట కార్యక్రమాన్ని చేపట్టగా.. తల్లిదండ్రుల నుంచి స్పందన బాగుంది. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1,276 కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది జూన్ 12 వరకు కొత్తగా 183 ప్రవేశాలు రాగా.. ఈ యేడు బడులు తెరువక ముందే ఇంత పెద్ద మొత్తంలో అడ్మిషన్లు రావడం విశేషం.
● ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య
ప్రభుత్వ బడులతోపాటు గురుకుల పాఠశాలలను పటిష్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల విద్యార్థుల మెస్ చార్జీలు పెంచింది. గురుకుల విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు, తమ సమస్యలను ఉన్నతాధికారులకు తెలిపేందుకు ఫోన్మిత్రను ప్రవేశపెట్టింది. ఇక అన్ని ప్రభుత్వ బడుల్లో ఉచితంగా పుస్తకాలు, నోట్బుక్కులు ఇతర సామగ్రిని అందజేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ బడుల్లో 2,70,587 పుస్తకాలు అవసరం ఉండగా..ఇప్పటికే 2,58,419 పుస్తకాలు చేరుకున్నాయి. నోట్బుక్కులు 3,07,765 అందుబాటులో ఉన్నాయి. ఒకటి నుంచి ఐదోతరగతి వరకు వర్క్బుక్స్ 52,354 అవసరం ఉండగా..34,237 అందాయి. యూనిఫామ్స్ 39,039 అవసరం కాగా 38,600 అందించారు. మధ్యాహ్న భోజనం, రాగిజావ, అల్పాహారం, కంప్యూటర్ విద్య, మరికొన్ని పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ల వంటి వసతులు కల్పించారు.
జిల్లా సమాచారం
ప్రభుత్వ పాఠశాలలు : 511
గురుకులాలు : 22
కేజీబీవీలు : 13
మదర్సా : 01
ప్రైవేటు స్కూళ్లు : 122
బడిబాటలో ప్రవేశాలు : 1,276
గతేడాది విద్యార్థులు : 80,108

సర్కారు బడికే జై