
అమ్మనబ్రోలులో పోలీసుల సోదాలు
ఒంగోలు టౌన్/నాగులుప్పలపాడు: రాష్ట్రంలో సంచలనం సష్టించిన టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదటి రోజు మంగళవారం కొప్పోలులో బొర్లగుంట వినోద్కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు బుధవారం రెండో రోజు అమ్మనబ్రోలులోని ఆళ్ల సాంబశివరావు అలియాస్ సిద్ధాంతి ఇంట్లో సోదాలు నిర్వహించారు. నాగులప్పలపాడు ఎస్సై షేక్ రజియా సుల్తానా, సంతనూతలపాడు ఎస్సై అజయ్కుమార్తో కలిసి ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అమ్మనబ్రోలులోని ఆళ్ల సాంబశివరావు ఇంటికి వచ్చారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ముప్ప సురేష్ను పోలీసులు ప్రధాన నిందితుడని చెబుతున్నారు. ముప్ప సురేష్కు స్వయాన మేనమామ సాంబశివరావు ఇంట్లో ముద్దాయిలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ప్రామిసరీ నోట్లు, ఇతరా కీలకమైన పత్రాలు, ఖాతాల వివరాలు, బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలించారు. అలాగే ముప్ప సురేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను విచారించారు. మరో రెండు రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. 27వ తేదీ సాయంత్రంతో నిందితుల పోలీసు కస్టడీ ముగియనుంది. ఇదిలా ఉండగా ముప్ప సురేష్ ఉన్నత న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడినట్లు సమాచారం.
మరింత బాధ్యతగా విధులు నిర్వహించాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: పదోన్నతి పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతగా విధులు నిర్వహించి పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా వ్యవహరించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు విభాగానికి చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా, నలుగురు ఏఎస్లకు ఎస్ఐలుగా పదోన్నతి ఉత్తర్వులు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ ప్రజలు పోలీసులపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని, ఉన్నతాధికారులు మన్ననలు పొందాలని చెప్పారు. వివిధ ఫిర్యాదులతో పోలీసు స్టేషన్లకు వచ్చే బాధితులకు అండగా నిలబడాలని, విధి నిర్వాహణలో శాఖాపరమైన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఏవో రామ్మోహన్రావు, ఏఆర్ఐలు రమణారెడ్డి, సీతారామిరెడ్డి, డీపీఓ సిబ్బంది రవికిరణ్ పాల్గొన్నారు.
రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి
ఒంగోలు టౌన్: ఒంగోలు–కరవది రైల్వేస్టేషన్ల మధ్య రైలు నుంచి జారి పడి వృద్ధుడు దుర్మరణం చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలు రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం నెంబర్–3లో తిన్ సుకియ నుంచి తంబరం వెళ్తున్న రైలు నుంచి గుర్తు తెలియని 65 ఏళ్ల వృద్ధుడు జారి పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. తెలుపు రంగు చొక్కాపై మెరున్ కలర్ డిజైన కలిగిన ఫుల్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సమాచారం తెలిసిన వారు 94406 27647 నంబర్కు ఫోన్ చేయాలని ఎస్సై కె.మధుసూదన్రావు సూచించారు.

అమ్మనబ్రోలులో పోలీసుల సోదాలు

అమ్మనబ్రోలులో పోలీసుల సోదాలు