తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్‌ట్రా! | Congress calculations on polling pattern of Lok Sabha elections: TS | Sakshi
Sakshi News home page

తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్‌ట్రా!

May 14 2024 12:54 AM | Updated on May 14 2024 6:19 AM

Congress calculations on polling pattern of Lok Sabha elections: TS

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళిపై కాంగ్రెస్‌ లెక్కలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళి తమకు అను కూలంగానే ఉందని కాంగ్రెస్‌ పార్టీ అంచనా వేస్తోంది. ఇక్కడి 17 లోక్‌సభ స్థానాలకు తొమ్మిది సీట్లలో విజయం ఖాయమని.. అదనంగా మరో స్థానమూ వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం పోలింగ్‌ ముగిసిన అనంతరం ఓటింగ్‌ సరళిపై లెక్కలు వేసుకున్నారు. మొత్తమ్మీద పది చోట్ల బీజేపీతో, ఆరు స్థానాల్లో బీఆర్‌ఎస్‌తో గట్టి పోటీ జరిగిందని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆరు సీట్లలో కారుతో పోరు.. 
రాష్ట్రంలోని ఆరు స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తోనే ఫైట్‌ జరిగిందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, పెద్దపల్లి స్థానాల్లో గులాబీ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య పోరు జరిగిందని చెప్తున్నారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ బలహీనం కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు.

నల్లగొండ, ఖమ్మం, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులు బలహీనంగా ఉన్నారని.. నాగర్‌కర్నూల్‌లో కాస్త పోటాపోటీ ఉండవచ్చని పేర్కొంటున్నారు. మెదక్‌లో మాత్రం మూడు పారీ్టల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సంస్థాగతంగా బలంగా ఉన్న నేపథ్యంలో బీజేపీ మూడో స్థానంలోకి వెళుతుందని అంచనా వేస్తున్నారు. 

ఆ పది చోట్ల మరోలా పోటీ! 
రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానా ల్లో బీజేపీతోనే ముఖాముఖి పోరు జరిగిందని గాంధీభవన్‌ వర్గాలు అంటున్నాయి. భువనగిరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్‌ స్థానాల్లో బీజేపీతో ప్రధాన పోటీ జరిగిందని చెప్తున్నాయి. ప్రాథమిక అంచనాల మేరకు ఇందులో కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి స్థానాల్లో గెలుపునకు కొంత దూరంలో ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

సికింద్రాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌లలో తీవ్ర పోటీ జరిగిందని.. ఆ సీట్లలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా ఉందని అంటున్నాయి. పోలింగ్‌ తీరుపై పరిశీలన సోమవారం జరిగిన లోక్‌సభ ఓటింగ్‌ సరళిని కాంగ్రెస్‌ పార్టీ నిశితంగా పరిశీలించింది. గాం«దీభవన్‌లోని వార్‌ రూం వేదికగా టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎప్పటికప్పుడు పోలింగ్‌ తీరును గమనిస్తూ.. పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు తగిన సూచనలు చేసింది. మరోవైపు కొడంగల్‌లో ఓటు వేసి వచి్చన అనంతరం క్యాంపు కార్యాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, కీలక నేతలతో సంప్రదిస్తూ, సూచనలిస్తూ గడిపారు.

పోలింగ్‌ తీరుపై పరిశీలన
సోమవారం జరిగిన లోక్‌సభ ఓటింగ్‌ సరళిని కాంగ్రెస్‌ పార్టీ నిశితంగా పరిశీలించింది. గాంధీభవన్‌లోని వార్‌ రూం వేదికగా టీపీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఎప్పటికప్పుడు పోలింగ్‌ తీరును గమనిస్తూ.. పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు తగిన సూచనలు చేసింది. మరోవైపు కొడంగల్‌లో ఓటు వేసి వచ్చిన అనంతరం క్యాంపు కార్యాలయం వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని సమీక్షించారు. పార్టీ అభ్యర్థులు, కీలక నేతలతో సంప్రదిస్తూ, సూచనలిస్తూ గడిపారు.

ఓటు బ్యాంకు పదిలమే!
గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సుమారు 40శాతం ఓటు బ్యాంక్‌ పదిలంగానే ఉందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వీలైతే మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 30 శాతం ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. అప్పుడు పార్టీకి కష్టకాలంలో లభించిన ఆ ఓటుబ్యాంకు ఇప్పుడు కచ్చితంగా మళ్లీ వచ్చి ఉంటుందని చెప్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముస్లిం, క్రిస్టియన్‌ మైనార్టీల ఓట్లను కొంత బీఆర్‌ఎస్‌ లాగేసిందని.. ఇప్పుడు మాత్రం ఆ వర్గాలకు చెందిన మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపారని నేతలు అంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వంటి పథకాల అమలు, పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తామన్న హామీలు గ్రామీణ ఓటు బ్యాంకుతోపాటు మహిళా ఓట్లను కాంగ్రెస్‌ వైపు తిప్పగలిగాయని చెప్తున్నారు.

అయితే బీఆర్‌ఎస్‌ ఓటు బ్యాంకు కొంతమేర బీజేపీ వైపు వెళ్లిందని.. కానీ అది బీజేపీ అభ్యర్థులను గెలిపించేంత స్థాయిలో జరగలేదని, అంటే బీజేపీ ఓటు బ్యాంకు పెరిగినా ఎక్కువ సీట్లు రాబోవని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని.. 10–12 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement