
సింగరేణిలో సీబీఎస్ఈ
● విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడమే లక్ష్యం ● అనుమతుల కోసం ముమ్మర ప్రయత్నాలు ● ఇప్పటికే సెక్టార్ –3 స్కూల్లో ప్రయోగాత్మకం ● మరో తొమ్మిది పాఠశాలల్లో అమలుకు వేగంగా చర్యలు ● కార్మికులు, ఉద్యోగుల్లో పెరుగుతున్న డిమాండ్
విస్తరిస్తాం
గోదావరిఖని: సంస్థ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఇకనుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పద్ధతిన విద్యాబోధన చేసేందుకు సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రయోగాత్మకంగా యైటింక్లయిన్ కాలనీ సెక్టార్ –3 పాఠశాలలో సీబీఎస్ఈ పద్ధతిన విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. దీనిని సంస్థ వ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో ఒకటినుంచి తొమ్మిదో తరగతి వరకు ఇదేవిధానంలో చదువు చెప్పాలని సింగరేణి నిర్ణయించింది.
భారీస్పందన..
ఆర్జీ–2 ఏరియా యైటింక్లయిన్కాలనీ సెక్టార్–3 స్కూల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్న సీబీఎస్ఈ విధానానికి భారీగా స్పందన వచ్చింది. అన్ని తరగతుల్లో కలిపి సుమారు 408 వ రకు సీట్లు ఉంటే.. దాదాపు 1,600 మంది ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడం తల్లిదండ్రుల నుంచి వస్తున్న స్పందనకు అద్దంపడుతోంది. ఈస్కూల్లో సీటు సాధించేందుకు పైరవీలు కూడా జోరందుకున్నాయి. అయితే, సింగరేణి యాజమాన్యం సీబీఎస్ ఈ బోధనపై స్పష్టమైన ప్రకటన చేసింది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 9 స్కూళ్లలో ఈ విధానంలో విద్యాబోధన చేసేందుకు అడుగులు వేస్తోంది.
పెరుగుతున్న యువకార్మికుల సంఖ్య
కారుణ్య నియామకాలతో సింగరేణి సీనియర్ కార్మికుల స్థానంలో యువకార్మికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. వారిసంఖ్య ప్రస్తుతం సుమారు 12వేలకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈక్రమంలో సింగరేణి స్కూళ్లలో తమ పిల్లలను చదివించేందుకు పోటీపడుతున్నారు. సంస్థలో సుమారు 42 వేల కుటుంబాలు ఉండగా, ఒకటే స్కూల్లో సీబీఎస్ఈ పద్ధతిన బోధించేందుకు అనుమతి లభించింది. దీనిని ఆధునీకరించడం కోసం సింగరేణి రూ.5కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి సాధించింది. అన్ని హంగులు పూర్తిచేసుకుని ఈనెల 14న సీఎండీ బలరాం చేతుల మీదుగా ప్రారంభించేందుకు యాజమాన్యం సన్నాహాలు పూర్తిచేస్తోంది.
కార్మికేతరుల పిల్లలకు కూడా..
సీబీఎస్ఈ సిలబస్ ప్రారంభిస్తున్న సింగరేణి పాఠశాలలో సీటు సాధించేందుకు పోటీపడుతున్నారు. 80 శాతం సింగరేణి కార్మికుల పిల్లలు, 20 శాతం ఇతరులకు సీట్లు కేటాయించారు. అందులో 408 సీట్లకు సుమారు 1,600 దరఖాస్తులు రావడంతో యాజమాన్యం తలపట్టుకుంటోంది. ఎవరికి సీట్లు కేటాయించాలో తెలియక తికమకపడుతోంది. అయితే, సీట్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించింది. డి మాండ్ భారీగా ఉండడంలో సంస్థలోని తొ మ్మిది స్కూళ్లలో కూడా ఇదే విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
తొమ్మిది పాఠశాలలకు విస్తరణ..
సంస్థవ్యాప్తంగా ఉన్న తొమ్మిది స్కూళ్లలో సీబీఎస్ సిలబస్ ప్రవేశపెట్టాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే ఒక పాఠశాలకు అనుమతి లభించగా, మిగతా వాటికి పర్మిషన్ సాధించేందుకు యా జమాన్యం ప్రయత్నాలు ప్రారంభించింది. బాలికల కళాశాల, మహిళా డిగ్రీ, పీజీ కళశాల, పాలిటెక్నిక్లు నిర్వహిస్తూ సుమారు 7,642 మంది విద్యార్థులకు విద్య అందిస్తోంది.
క్రీడలు, ఎన్సీసీకీ పెద్దపీట
సింగరేణి స్కూళ్లలలో క్రీడలు, అథ్లెటిక్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో శిక్షణ ఇస్తోంది. ఏటా వీరికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతోంది. అలాగే ఎస్సీసీలో శిక్షణ పొందే విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండటంతో మంచి డిమాండ్ ఉంది.
సింగరేణి సమాచారం
పాఠశాలలు 9
జూనియర్ కాలేజీలు(బాలికలు) 1
మహిళా డిగ్రీ, పీజీ కాలేజీ 1
పాలిటెక్నిక్ 1
విద్యార్థుల సంఖ్య 7,642
కార్మికుల సంఖ్య(సుమారు) 42,000
సింగరేణిలోని అన్ని స్కూళ్లలో సీబీఎస్ఈ విద్యా విధానం ప్రవేశపెడతాం. ప్రస్తుతం ఒకే స్కూల్కు అనుమతి లభించింది. అందులో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు సీబీఎస్ సిలబస్ కొనసాగిస్తాం. రాబోయే రోజుల్లో అన్ని స్కూళ్లలో క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లోనూ నాణ్యమైన శిక్షణ ఇస్తాం.
– గుండా శ్రీనివాస్, ఎడ్యుకేషనల్ సెక్రటరీ, సింగరేణి

సింగరేణిలో సీబీఎస్ఈ