
అవగాహన విజయవంతం చేయాలి
పార్వతీపురంటౌన్: ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. జూన్ 15 నుంచి 30 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో సేవలు, మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి/క్లస్టర్ స్థాయి శిబిరాల ద్వారా వివిధ సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో అందించేందుకు ఉద్దేశించినట్లు తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆయుష్మాన్ భారత్ కార్డ్, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ పీఎం కిసాన్ కార్డులు, జన్ ధన్ ఖాతా, పీఎం జేజీబీవై, పీఎంఎస్ బీవై బీమా కవరేజ్, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సామాజిక భద్రత పింఛన్లు, ఉపాధి హామీ, పీఎం విశ్వకర్మ, ముద్ర తదితర జీవనోపాధి పథకాలు, పీఎం ఎంఈవై, ఇమ్యునైజేషన్ తదితర సీ్త్ర శిశు సంక్షేమ ప్రయోజనాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
పోషకాహార ప్రదర్శనల ఏర్పాటు
గ్రామస్థాయిలో ఆధార్లో నమోదు కానివారిని అంగన్వాడీ సిబ్బంది నమోదు చేయించాలని ఆదేశించారు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాల పోషక విలువలు తెలియజేసేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. పాడైన గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోను అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ చేయరాదని ఆదేశించారు. రక్తహీనత లేకుండా దృష్టి సారించాలని, ప్రసవ తేదీలను ముందుగానే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించాలని చెప్పారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగరాదని ఆయన స్పష్టం చేశారు. పుట్టిన బిడ్డకు పాలు పట్టే విధానం తెలియక పోవడం వల్ల కూడా కొన్ని శిశు మరణాలు జరుగుతున్నాయని, పాలు పట్టే విధానం పట్ల అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. గిరి చైతన్యం డిజిటల్ మీడియా వాహనం ద్వారా కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.