
విధుల నుంచి తొలగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ఆర్జేడీ జారీచేసిన ఉత్తర్వుల కాపీ
● మద్యంమత్తులో విధులకు హాజరు ● తీవ్రంగా స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు
కురుపాం: ఇంటర్మీడియట్ పరీక్షల ఇన్విజిలేషన్కు మద్యం సేవించి హాజరైన ఇద్దరు అధ్యాపకులను విధుల నుంచి తొలగిస్తూ ఆర్జేడీ (రాజమండ్రి) ఈ నెల 23న ఉత్తర్వులు జారీచేసిన విషయం ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 20వ తేదీన కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. ఆ సమయంలో ఇద్దరు ఇన్విజిలేటర్లు మద్యం సేవించి ఇన్విజిలేషన్ విధుల నిర్వహణలో అలసత్వం వహించారు. దీనిపై ప్రశ్నించిన స్వ్వాడ్ బృందంతో వాదనకు దిగారు. ఈ విషయంపై స్వ్కాడ్ బృందం కళాశాల ప్రిన్సిపాల్, ఆర్ఐఓకు ఫిర్యాదుచేసింది. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా డీవీఈఓ విచారణ జరిపి ఈ నెల 21న అందజేసిన నివేదిక ఆధారంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కామర్స్, హిందీ లెక్చరర్లను విధుల నుంచి బహిష్కరిస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో విషయం వెలుగుచూసింది. కామర్స్ అధ్యాపకుడు ఓ దినపత్రికలో (సాక్షికాదు) విలేకరిగా పనిచేస్తుండడం గమనార్హం.