రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది | - | Sakshi
Sakshi News home page

రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది

May 29 2025 7:21 AM | Updated on May 29 2025 7:21 AM

రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది

రైతులు రోడ్డెక్కితే రాష్ట్రం స్తంభిస్తుంది

చిలకలూరిపేట: బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రోడ్లమీదకు వస్తే రాష్ట్రం స్తంభించి పోతుందని నల్లమడ రైతు సంఘం కన్వీనర్‌ డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు చెప్పారు. బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఐటీసీ కంపెనీ ముందు నిర్వహిస్తున్న నిరసన దీక్ష బుధవారం రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది రైతాంగ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బర్లీ పొగాకు కలపకుండా ప్రపంచంలో ఏ దేశంలోనూ సిగరెట్లు తయారు కావన్నారు. సువాసన కోసం బర్లీ పొగాకును విదేశాలు సిగరెట్లలో ఉపయోగిస్తాయని తెలిపారు. పొగాకు కంపెనీలు కుట్రపూరితంగా ఏకమై ధరలను పతనం చేసేందుకు బర్లీ పొగాకు కొనుగోళ్లను నిలిపివేశారని ఆరోపించారు.

మంత్రి సమక్షంలో జరిపిన చర్చలకు విలువ లేదా?

రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ససమస్యను తీసుకువెళితే చర్చలతో సరిపెడుతున్నారని, రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి అచ్చెనాయుడు సమక్షంలో జరిగిన చర్చలకు విలువలేకుండా పోయిందని వెల్లడించారు. పొగాకు కంపెనీలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంటే, ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా అచేతనంగా ఉండటం ఏ మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల బాధలు వింటే భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది బర్లీ పొగాకు మంచి ధరలు లభించటంతో రైతులు బర్లీ పొగాకును ఎక్కువగా సాగు చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని గుర్తించిన పొగాకు కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకును కొనుగోలు చేయకుండా వ్యవహారాన్ని సాగదీసి తక్కువ ధరకు రైతుల వద్ద కొని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా కోట్లు గడించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. గత ఏడాది బర్లీ పొగాకు క్వింటా రూ. 18వేల వరకు కొన్నారని, ఈ ఏడాది కనీసం క్వింటాకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పుడెల్లా కొనుగోళ్లు చేస్తాం అనడం తప్పించి, అడుగు ముందుకు పడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కరించేందుకు రైతులు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు తాళ్లూరి బాబురావు, దాసరి వరహాలు, పేలూరి రామారావు, షేక్‌ సుభాని, ఇంటూరి భవాని వెంకటేష్‌, దోమల మరియదాసు, రెడ్డమ్మ నరిసిరెడ్డి, షేక్‌ నసీరుద్దీన్‌, మాడ శివ ప్రసన్నబాబు, జొన్నల రాజశేఖరరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం రాధాకృష్ణ, లోక్‌ సత్తా మాదాసు భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నల్లమడ రైతు సంఘం కన్వీనర్‌

డాక్టర్‌ కొల్లా రాజమోహనరావు

బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర

కల్పించాలని నిరసన దీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement