
తారస్థాయికి చేరిన కూటమి కుట్రలు
సాక్షి, నరసరావుపేట: ప్రజల కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు తారస్థాయికి చేరాయని మాజీ మంత్రి విడదల రజిని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో సోమవారం ఆమె స్పందించారు. గుండ్లపాడులో జరిగిన డబుల్ మర్డర్ పూర్తిగా టీడీపీలో ఆధిపత్యపోరుతో జరిగిందని ప్రత్యక్షసాక్షులు, పోలీసులు చెబుతున్నా ప్రభుత్వం కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిందన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో చంపడానికి ఉపయోగించిన జేబీఆర్ పేరుతో టీడీపీ నేత కారు దొరికినా ఇంకా వైఎస్సార్సీపీపై నెపం వేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గతంలో తోట చంద్రయ్య హత్య విషయంలోనూ ఇలానే శవరాజకీయాలు చేశారని గుర్తుచేశారు. ఇప్పటికే పిన్నెల్లిపై అనేక అక్రమ కేసులతో వేధించారని మరోసారి ఆయనపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఇంత బరితెగించి గతంలో ఏన్నడూ అక్రమ కేసులు పెట్టిన దాఖలాలు లేవన్నారు. పోలీసులు సైతం ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గి అక్రమ కేసులు నమోదు ఆ శాఖకు మాయని మచ్చగా నిలుస్తుందన్నారు. ఈ విషమ సంస్కృతిని కూటమి ప్రభుత్వం విడనాడాలని లేకపోతే భవిష్యత్తులో వీటన్నింటికి సమాధానాలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలిచి వారిని కాపాడుకుంటామన్నారు.
ఏమాత్రం సంబంధంలేని కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలను ఇరికిస్తున్నారు గుండ్లపాడు హత్యలు పూర్తిగా టీడీపీ వర్గపోరుతోనే జరిగాయి కావాలనే పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు నమోదు మాజీ మంత్రి విడదల రజిని