
హిందువులం.. ధర్మ బంధువులం !
నరసరావుపేట ఈస్ట్: ‘హిందువులం.. ధర్మ బంధువులం’ నినాదంతో భారత జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి తెలిపారు. హిందూ చైతన్య భారతి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పట్టణంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం కోసం, ధర్మం కోసం నేను సైతం.. అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. పహల్గామ్ ఘటనలో ఉగ్రవాద మూకలు హిందువులను మతం పేరుతో హతమార్చారని, భారతీయ మహిళ బొట్టు తుడిపేసిన ముష్కరులకు తగిన గుణపాఠం నేర్పామని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకుంటూ ధర్మాచరణ చేపట్టాలని పిలుపునిచ్చారు. పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం, శివుని బొమ్మ, మల్లమ్మ సెంటర్, 60అడుగుల రోడ్డు, రైల్యే అండర్ బ్రిడ్జి మీదుగా తిరిగి కళాశాలకు చేరింది. టాప్లెస్ వాహనంపై శ్రీ శివస్వామి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త, హిందూ చైతన్య భారతి ప్రతినిధులు కె.రామకృష్ణ, ఈ.ఎం.స్వామి, ఏబీవీపీ రాష్ట్ర కోశాధికారి కోడూరి సాంబశివరావు, అన్ని కుల సంఘాల ప్రతినిధులు, వినాయక చవితి పందిళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి పట్టణంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర