
దేశంలో నరహంతక పాలన
లక్ష్మీపురం: దేశంలో బీజేపీ నరహంతక పాలన కొనసాగిస్తోందని, మతాల మధ్య చిచ్చు పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బీజేపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మల్లయ్య లింగం భవన్లో శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళా రూపాల శిక్షణ శిబిరం శనివారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగాలకు అన్నీ అప్పగిస్తోందన్నారు. కమ్యూనిస్టు భావజాలాన్ని అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులతోపాటు ఆదివాసీలను దారుణంగా హతమార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలకు వస్తామని చెప్పినప్పటికీ కేంద్రం వారిని చంపే కార్యక్రమం చేయడం సరికాదన్నారు. తక్షణమే ఆపరేషన్ కగార్ను కేంద్రం ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో సరికొత్త నాటకానికి ప్రధాని నరేంద్ర మోదీ తెర తీశారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు భయపడి మోదీ పాక్పై యుద్ధాన్ని ఆపేశారని తెలిపారు. విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం అవుతామన్నారు. మహాసభలకు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్ పేరుతో
ఆదివాసీలను, మావోయిస్టులను
హతమార్చుతున్న కేంద్రం
విలేకరుల సమావేశంలో
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ