
ప్రసన్నాంజనేయునికి విశేష పూజలు
బెల్లంకొండ: మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ కోళ్లూరు ప్రసన్నాంజనేయ స్వామి వారి జయంతి, కల్యాణ ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు స్వామి వారికి విశేష పూజలను నిర్వహించారు. శనివారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు బొర్రా వెంకట అనంతాచార్యులు స్వామి వారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేక పూజ చేశారు. అనంతరం 1,008 అరటి పండ్లతో విశేష పూజలను నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పొంగళ్లు చేసి, నైవేద్యాలను సమర్పించారు. మొక్కుబడులు చెల్లించుకున్నారు. మండల దేవదాయ శాఖ ఈవో అవుడూరి వెంకటేశ్వరరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రికి గుంటూరు శ్రీ స్రవంతి సంగీత కళాశాల వారి శ్రీరామాంజనే యుధ్ధం, శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటికలను ప్రదర్శించారు. ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
1,008 అరటిపండ్లతో
అభిషేక కార్యక్రమం