
మేరా భారత్ మహాన్
గుంటూరు మెడికల్: ఉగ్ర దాడులతో భారత్ను భయపెట్టాలని పాకిస్థాన్ చూసింది కానీ చివరకు తోక ముడిచిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టు పెట్టడంతోపాటు కాల్పులను దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన దేశ సైనికులకు సంఘీభావంగా శనివారం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. తొలుత మార్కెట్ సెంటర్ హిందూ కాలేజీ నుంచి బయలుదేరి ఏసీ కాలేజీ, శంకర విలాస్ బ్రిడ్జి మీదుగా లాడ్జి సెంటర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదంపై తిరుగులేని విజయం సాధించామని వెల్లడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ పెహల్గామ్ ఉగ్ర దాడిలో బలైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరేలా ర్యాలీ నిర్వహించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ విజయం భారత సైన్యం, ఎన్డీఏ విజయంగా పేర్కొన్నారు. ర్యాలీలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు జూపూడి రంగరాజు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డెప్యూటీ మేయర్ షేక్ షజీల, కూటమి ప్రభుత్వ నేతలు పాల్గొన్నారు.
కళాశాల, పాఠశాలల విద్యార్థుల సంఘీభావం
కళాశాల, పాఠశాలల విద్యార్థులు 75 మీటర్ల జాతీయ పతాకాన్ని చేతబూని, పెద్దఎత్తున తిరంగా ర్యాలీకి సంఘీభావం తెలిపారు. బీజేపీ నేతలు నూకల మధుకర్ జీ, బిట్ర వెంకట శివన్నారాయణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు.
అమర వీరులకు సంఘీభావంగా
తిరంగా యాత్ర