
ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం
గుంటూరు మెడికల్ : పల్నాడుకు చెందిన నాగేశ్వరరావు కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేలుకొని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రమైన గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సుబ్బారావు ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
బాపట్లకు చెందిన శ్రీనివాస్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల కాలంలో తీవ్రమైన కడుపు మంట సమస్య ఉత్పన్నమవడంతో తల్లిదండ్రులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. విద్యార్థి ఎక్కువగా పాస్ట్ఫుడ్ తీసుకోవడం, సకాలంలో ఆహారం తీసుకోకుండా చదువు ధ్యాసలో పడి ఒత్తిడికి గురవడం ద్వారా ఐబీడీ వ్యాధి బారిన పడ్డట్లు వైద్యులు నిర్ధారించి చికిత్స అందిస్తున్నారు.
ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్ల కంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్ప పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
వ్యాధి లక్షణాలు
క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు. వాంతులు, విరేచనాలు, కొన్నిసార్లు రక్తపు విరేచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి.
కారణాలు
ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాల మందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారణాలు.
నిర్ధారణ
ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్, మలహర్ష ద్వారా ఐబీడీ వ్యాధిని నిర్ధారిస్తారు.
బాధితులు
రోజురోజుకు పెరుగుతున్న బాధితులు
ఐబీడీ వ్యాధిపై అవగాహన
అవసరం అంటున్న వైద్యులు
ప్రాథమిక దశలో గుర్తించి
చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు
రేపు వరల్డ్ ఐబీడీ డే
ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.
–డాక్టర్ షేక్ నాగూర్బాషా,
గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు
15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధి బారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఉన్న ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు.

ఆధునిక జీవన శైలే ఐబీడీకి మూలం