భువనేశ్వర్: కటక్ ఎస్ిసీబీ అగ్ని ప్రమాదంపై కేంద్ర బృందం దర్యాప్తు ప్రారంభమైంది. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కేంద్ర దర్యాప్తు బృందం బుధవారం ఎస్ిసీబీ వైద్య బోధన ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతాలు, సంబంధిత వర్గాలతో విచారణ చేపట్టింది. ఈ ఆస్పత్రి ట్రామా ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 12 మంది రోగులు మరణించిన సంఘటన ఇటీవల ముగిసిన శాసన సభ సమావేశాల్లో తీవ్ర అలజడి రేపిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఈ విచారకర సంఘటనపై నైతిక బాధ్యత వహిస్తు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టరు ముఖేష్ మహాలింగ్ పదవికి రాజీనామా చేసి వైదొలగాలని విపక్షాలు గట్టి గా పట్టుబట్టి నిరవధికంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ డాక్టరు హరి బాబు కంభంపాటిని సంప్రదించి చొరవ కల్పించుకుని సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని విపక్ష వర్గం అభ్యర్థించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం కటక్ ఎస్సీబీ సందర్శించి విచారణ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బృందం ఈ ఏడాది మార్చి 16న ట్రామా ఐసీయూలో సంభవించిన అగ్ని ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ బృందంలో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి (ఎన్డీఎంఏ), ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రముఖులు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ప్రతినిధి, ఒడిశా రాష్ట్ర విపత్తు స్పందన అథారిటీ (ఓస్డమా), అగ్ని మాపక, పౌర రక్షణ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు.
యువకుడి మృతదేహం లభ్యం
రాయగడ: స్థానిక మజ్జిగౌరి మందిరం సమీపంలో గల జంఝావతి నది వంతెన పైనుంచి మంగళవారం దూకిన యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. స్థానిక కోపరేటీవ్ కాలనీకి చెందిన రంజిత్ కుమార్ సాహు(34) అనే యు వకుడు మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన సొంత బైక్పై వచ్చి జంఝా వతి నది వద్ద పార్కింగ్ చేశాడు. వంతెన పైనుంచి దూకేశాడు. అగ్నిమాపక సిబ్బంది యువకుని ఆచూకీ కోసం గాలించారు. బుధవారం ఉద యం 9 గంటల ప్రాంతంలో యువకుని మృతదేహం బ్రిడ్జికి కొంత దూరంలో లభించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


