కంచికచర్ల: స్థానిక వసంతకాలనీలో ఓ మహిళ తన ఇంటి వరండాలో నిద్రి స్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మంచంపై ఉన్న దిండుకింద చేయపెట్టగా గమనించిన ఆమె దొంగ.. దొంగా అని కేకలు వేసింది. దీంతో ఆ వ్యక్తి ఆమైపె కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి పరారయ్యాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల వసంతకాలనీలో బాలుర వసతి గృహం వెనుక ఓ ఇంట్లో నల్లకట్ల రమాదేవి(47) సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి వరండాలో నిద్రించింది. గుర్తు తెలియని ఆ ఇంటి వద్దకు వచ్చి తాళం చెవుల కోసం వెతికాడు. అవి కనిపించకపోవటంతో రమాదేవి నిద్రిస్తున్న మంచం వద్దకు వచ్చి దిండు కింద చేయి పెట్టాడు. ఈ అలికిడికి రమాదేవికి మెలుకువ వచ్చి, గుర్తుతెలియని వ్యక్తిని గమనించి దొంగ.. దొంగ అంటూ కేకలు వేసింది. వెంటనే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఆమె ముఖం, శరీ రంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యాడు. కేకలు విని రమాదేవి ఇంటికి వచ్చిన స్థానికులు గాయపడిన ఆమెను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.విశ్వనాథ్ తెలిపారు.


